ఏదోరకంగా ఇరికించటమే టార్గెట్టా ?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఏదోరకంగా ఇరికించటమే నరేంద్రమోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మోడీకి కేజ్రీవాల్ కు ఏమాత్రం పడటంలేదని అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రిగా ఉన్న మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కంట్లో నలుసులాగ తయారయ్యారు. పైగా వరసగా మూడుసార్లు బీజేపీని దెబ్బకొట్టి ఆప్ అధికారంలోకి రావటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. అందుకనే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏదోరకంగా ఇబ్బంది పెడుతునే ఉంది.

తాజాగా లోఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా డిసైడ్ చేశారు. సక్సేనాకు కేజ్రీవాల్ కు ఏమాత్రం పడటంలేదు. ఎల్జీని ముందుపెట్టుకుని మోడీ ప్రభుత్వం వెనకనుండి వ్యవహారాలను నడుపుతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎల్జీ అడ్డంకొడుతున్నారు. దాంతో వీళ్ళిద్దరి మధ్య ప్రత్యక్ష వివాదమే నడుస్తోంది.

ఈ నేపధ్యంలోనే బస్సుల కొనుగోలు ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని ఎల్జీ నిర్ణయించటం మరో వివాదంగా మారే అవకాశముంది. 2019లో ఆప్ ప్రభుత్వం 1000 లో ఫ్లోర్ బస్సులను కొన్నపుడు అవకతవకలు జరిగాయని ఎవరో ఎల్జీకి ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదును పట్టుకుని ఇపుడు ఎల్జీ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇదే విషయమై దాదాపు ఏడాది క్రితమే విచారణ జరిగింది. ఆ విచారణలో పెద్దగా ఏమీ తేలలేదట. మరి తొందరలో మొదలవ్వబోయే సీబీఐ విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఈమధ్యనే లిక్కర్ స్కాం జరిగిందని కేంద్రం సీబీఐతో విచారణ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆఫీసు, ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. బ్యాంకు ఖాతాలను, లాకర్లను కూడా తనిఖీచేసింది. ఎంతగా దర్యాప్తు జరిగినా మనీష్ కు వ్యతిరేకంగా ఆధారాలను సీబీఐ సంపాదించలేకపోయింది. ఇంకా ఆ వివాదం నడుస్తుండగానే లో ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలంటు సీబీఐ విచారణకు ఆదేశించింది.