పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతులు గత కొన్ని రోజులుగా ఏనుగుల బెడదను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే.. పంట పొలాలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. రెండు కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు పంపించారు.
పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్న కుంకీ ఏనుగులకు మార్గమధ్యంలో మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. కుంకీ ఏనుగులపై పూలు చల్లి, ఆహారం తినిపించారు. అనంతరం.. మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపునకు సాగనంపడంతో కుంకీలు జయంత్, అభిమన్యు మంగళగిరి నుంచి ప్రత్యేక వాహనంలో పయనమయ్యాయి.
గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంట పొలాలను పలు ఏనుగులు ధ్వంసం చేశాయి. వాటి దాడిలో పలువురు రైతులు కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది కిందట అటవీ శాఖ మంత్రి హోదాలో ఆసమస్య పై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్.. మదపుటేనుగుల నుంచి పంటలను , ప్రజలను కాపాడేందుకు కుంకీ ఏనుగులను తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం కర్ణాటకలో మాత్రమే కుంకీ ఏనుగులు ఉన్నాయి.
ఈ క్రమంలో కర్ణాటక అప్పటి సీఎం సిద్దరామయ్యతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మూడు కుంకీ ఏను గులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఎక్కడ ఏనుగుల సమస్య ఉంటే అక్కడికి వీటిని పంపించి .. ఏనుగుల నుంచి స్థానికులను రక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్వతీపురం మన్యం ప్రాంతానికి వాటిని తరలించారు. అదేసమయంలో `హనుమాన్` ప్రాజెక్టు పేరుతో అటవీ సంరక్షణకు కూడా ఉపముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates

