కాళేశ్వ‌రం కోసం భూమి ఇవ్వాల్సిందే.. లేదంటే చచ్చిపోతా: అధికారి

“కాళేశ్వ‌రం కోసం నీ భూమి ఇవ్వాల్సిందే. నాపైనా.. తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయి. నువ్వు భూమి ఇవ్వనని అంటే.. నువ్వు కాదు.. నేనే పురుగు మందు తాగుతా. చ‌చ్చిపోతా. నా కుటుంబం అనాధై పోతుంది.“ ఇదీ.. తెలం గాణలోని రైతుకు ఆర్డీవో చేసిన హెచ్చ‌రిక‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయింది.  ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాలువ భూసేకరణ సర్వే కోసం ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ‌కు దిగింది. సీఎం కేసీఆర్ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌ర్వే చేయాల‌ని ఆదేశం జారీచేయ‌డంతో అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. ఈ క్ర‌మంలో రైతుల‌ను అదిలించో బెదిరించో.. భూములు తీసుకోవాల‌ని చూస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో తాజాగా అధికారులను రైతులు అడ్డుకున్నారు. తాము భూములు ఇచ్చేది లేద‌ని.. తాము న‌మ్ముకున్న భూమిని ఇవ్వ‌బోమ‌ని.. లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తే.. పురుగుల మందు తాగుతామని ఓ రైతు కుటుంబం హెచ్చ‌రించింది.

దీంతో ఓ అధికారి వెంట‌నే స్పందిస్తూ.. మాపై తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయి. భూసేకరణ చేయకుంటే తనదీ పురుగుల మందు తాగాల్సిన పరిస్థితేనంటూ.. ఆ అధికారి వ్యాఖ్యానించడం  తీవ్ర చర్చనీయాంశం గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలంలో అదనపు టీఎంసీ కాలువ భూసేకరణ సర్వేలో జాప్యంపై ఆర్డీవో శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలాసాగర్లో భూసేకరణ సర్వే కోసం వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.

విషయం తెలుసుకున్న ఆర్డీవో విలాసాగర్ చేరుకొని అధికారులతో సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న రైతులు తమ అనుమతి లేనిది వ్యవసాయ పొలాల్లోకి రావొద్దని సూచించారు. గ్రామ సభ నిర్వహించి పరిహరంపై స్పష్టత ఇవ్వాలన్నారు. పురుగుల మందు డబ్బాలతో ఆందోళన నిర్వహించారు. పురుగుల మందు తాగుతామని రైతులు పేర్కొనడంతో తాను ప్రభుత్వ ఉద్యోగినని చట్టపరిధిలో పనిచేయాల్సి ఉంటుందని, త‌న‌పైనా బోలెడు మంది ఒత్తిడి తెస్తున్నార‌ని.. ఆర్డీవో చెప్పాడు.

అంతేకాదు..  తనకు పురుగుల మందు ఇవ్వాలని తాగుతానని, ఇక్క‌డే చ‌చ్చిపోతాన‌ని ఆర్డీవో శ్రీనివాస్‌ పేర్కొన్నారు. భూ సేకరణ చేయకుంటే తమదీ అదే పరిస్థితంటూ… రైతులకు ఆర్డీవో వివరణ ఇచ్చారు. చట్టప్రకారం భూసేకరణ జరుగుతుందని రైతులు సహకరించాలన్నారు. భూసేకరణపై గతంలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. తాను చెప్పిన విధంగా ఎందుకు సర్వే చేయడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. రైతులకు వివరంగా చెప్పి సర్వే చేయాలని ఆదేశించారు. అయితే.. ఆర్డీవో చేసిన వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాలు మండి ప‌డుతున్నాయి. సీఎం కేసీఆర్ నియంత పాల‌న‌లో అధికారులు కూడా ప‌నిచేయ‌లేక పోతున్నార‌ని.. కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు దుయ్య‌బ‌డుతున్నారు.