తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీనుంచి తప్పుకొంటున్నారన్న చర్చ జనసేన వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే.. దీనిపై ఆరణి మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రధానంగా రెండు కారణాలతో ఆరణి తప్పుకొంటున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం తిరుపతి నియోజకవర్గంలోనే కాకుండా పార్టీలోనూ హాట్ టాపిక్ అయింది.
1) ఆరోగ్య సమస్యలు: గత ఏడాదిగా ఆరణి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఏదో ఆపరేషన్ కూడా చేయించుకున్నట్టు కొన్నాళ్లు ప్రచారం జరిగింది. పార్టీకి కూడా ఆరు మాసాల వరకు ఆయన దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ బాధ్యతలను, నియోజకవర్గంలో కార్యకలాపాలను అన్న కుమారులకు అప్పగించారనే ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతోనే వచ్చే ఎన్నికల్లో ఆరణి పోటీ నుంచి తప్పుకొంటున్నారని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని కూడా అంటున్నారు.
2) పార్టీలో సఖ్యత లేమి: పార్టీలో సఖ్యత పెద్దగా లేకపోవడం కూడా ఆరణికి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఆయన వ్యవహార శైలిని జనసేన నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారని, స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారని అంటున్నారు. అయితే.. అసలు వారే తనకు అందుబాటులో ఉండడం లేదన్న వాదన ఆరణి నుంచి వినిపిస్తోంది. అయితే.. ఇదంతా టీకప్పులో తుఫానే అని చెబుతున్నా.. ఎన్నికల పై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ రెండు పరిణామాలతోనే కాదు.. స్థానికంగా టీడీపీ నుంచి కూడా జనసేనకు పెద్దగా సమన్వయం కూడా ఉండడం లేదన్న చర్చ సాగుతోంది. ఇటీవల టీడీపీ నాయకులు నిర్వహించిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు నాయకులు వెల్లడించారు. ఇది కూడా ఆరణికి ఇబ్బందిగానే ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి తాను తప్పుకొనే ఆలోచనలో ఉన్నట్టు తన వర్గంతో చెబుతున్నారని అంటున్నారు. అయితే.. తన స్థానాన్ని తన అన్న కుమారుడికి ఇవ్వాలన్న సూచనలు కూడా ఆయన రెడీ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates

