ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ నేతలు ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విశేషణాలేమీ ఆయనలో లేవని తాజాగా తేలిపోయిందన్న వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇతరుల సంగతి అలా పక్కనపెడితే… తోడబుట్టిన చెల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి… ఏకంగా ఆపరేషన్ చేయించుకున్నా కూడా జగన్ లో ఏమాత్రం స్పందన కనిపించలేదు. వెరసి తోడబుట్టిన చెల్లి బాగోగులే పట్టించుకోని జగన్.. ఇక రాష్ట్ర ప్రజల బాగుగులు ఏం పట్టించుకున్నారన్న విమర్శలు ఒకింత గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఎప్పుడు యమా స్ట్రాంగ్ గా కనిపించే కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైన ఆమె ఏ ఒక్కరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఈ విషయం గురించి అంతగా తెలియని వారంతా… షర్మల ఎక్కడున్నారు?.. ఏం చేస్తున్నారు? అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమె ఫోన్ లోనూ అందుబాటులో లేని వైనంపైనా పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. తాజాగా అసలు విషయం బయటపడింది. అనారోగ్యంతో సతమతమైన షర్మిల… ఉన్నపళంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, ఆ క్రమంలో ఆమెకు ఆపరేషన్ కూడా జరిగిందని తాజాగా తేలింది.

తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా షర్మిల ఆదివారం ఓ పోస్టు పెట్టారు. అందులో ఆసుపత్రి బెడ్ పై అచేతనావస్థలో షర్మిల కనిపిస్తున్నారు. కడుపులో నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరానని,,, వైద్యులు తనకు ఆపరేషన్ చేశారని, ప్రస్తుతం అనారోగ్యం నుంచి తాను కోలుకుంటున్నానని… తన కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆమె సదరు పోస్టును పెట్టారు. ఈ పోస్టును చూసిన వారంతా… ఆమె త్వరగా కోలుకోవాలని…తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లో ఆమెపాలుపంచుకోవాలని ఆకాంక్షిస్తూ వేలాది మంది పోస్టులు పెట్టారు.

షర్మిల ఆరోగ్యం కోసం అంతా తపిస్తూ ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె సోదరుడు జగన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించలేదు. మరెవరైనా అయితే… అన్ని పనులు పక్కనపెట్టేసి మరీ చెల్లి వద్దకు చేరి… ఆమె బాగోగులను పట్టించుకునే వారే. అయితే ఆ తరహా పరిస్థితి జగన్ లో కనిపించలేదు. నిత్యం రాజకీయ వ్యూహాల్లో నిమగ్నమైన జగన్.. తోడబుట్టిన చెల్లికి ఆపరేషన్ జరిగిందని తెలిసినా… ఆమెను పలకరించిన పాపాన పోలేదు. కనీసం ఆమె త్వరగా కోలువాలంటూ వైఎస్ అభిమానులు కోరినట్లుగా కనీసం ఓ పోస్టు కూడా పెట్లలేదు. 

ఈ తరహా జగన్ వైఖరిపై వైఎస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎంతగా విభేదాలు ఉన్నా… తోడబుట్టిన చెల్లికి ఆఫరేషన్ జరిగినా కూడా పట్టించుకోవడం లేదంటే జగన్ మనిషే కాదంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని బోల్డ్ గా వ్యక్తం చేశారు. నిజమే మరి… రాజకీయంగా ఎంత విభేదాలు ఉన్నా.. ఇలాంటి ఆపద సమయంలో తోడబుట్టిన చెల్లిని పమార్శించకపోవడం నిజంగా దారుణమేనన్న వాదన అయితే బలంగా వినిపిస్తోంది. జనం అభిప్రాయం తెలుసుకున్న తర్వాత అయినా జగన్ తన తోబుట్టువు బాగోగులను పట్టించుకుంటారో?… లేదో? చూడాలి.