వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో పాల్గొంటూనే ఉన్నారు. దర్శకుడు అజయ్ భూపతి తన వంతుగా ఇంటర్వ్యూల రూపంలో బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు అతిథిగా వస్తే అన్ని లెక్కలు సరిపోతాయని టీమ్ భావిస్తోంది కానీ సూపర్ స్టార్ రాక పట్ల అంతర్గతంగా అనుమానాలైతే ఉన్నాయి. డేట్స్ సమస్య వల్ల రాకపోవచ్చని టాక్.
ఒకవేళ వస్తే అంతకన్నా పెద్ద బూస్ట్ శ్రీనివాస మంగాపురంకు మరొకటి ఉండదు. టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి ఊపు మీద ఉంది. పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ ఇలా క్రమం తప్పకుండ సక్సెస్ లు పలకరిస్తూనే ఉన్నాయి. వీకెండ్స్ లో థియేటర్లను హౌస్ ఫుల్ చేస్తూ మంచి కలెక్షన్లు రాబట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో జయకృష్ణ కూడా హిట్టు కొడితే వరస కొనసాగుతుంది. అయితే అంచనాల పరంగా చూసుకుంటే దీని మీద ఇంకా బజ్ ఏర్పడాల్సిన అవసరం ఉంది.
జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలలో ఓ రెండు బాగున్నప్పటికీ ఛార్ట్ బస్టర్ అయ్యేంత వైరల్ కాలేదు. జయకృష్ణ వేస్తున్న ఒక స్టెప్పు మాత్రం సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. ఘట్టమనేని మూడో తరం మొదటి వారసుడిగా గౌతమ్ కన్నా ముందు ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణకు మహేష్, కృష్ణ ఫ్యాన్స్ ఎలాంటి స్వాగతం చెబుతారోనని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. వాళ్ళ సపోర్ట్ ఉంటే కుర్రాడికి మంచి ఓపెనింగ్ దక్కుతుంది.
విచిత్రంగా మోహన్ బాబు లాంటి సీనియర్ ఆర్టిస్టు ఉన్నా ఆ అంశాన్ని పబ్లిసిటీలో ఎక్కువ హైలైట్ చేయలేకపోతున్నారు. పైగా ఆయన ప్యారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో శ్రీనివాస మంగాపురం టీమ్ కు అంత సులభంగా అందుబాటులోకి రావడం లేదని ఇన్ సైడ్ టాక్. డెబ్యూలు ఉన్నంత మాత్రాన ఆడియన్స్ చూడకుండా పోరు. బాగుందని టాక్ వస్తే ఖచ్చితంగా టికెట్లు కొంటారు. కాకపోతే మొదటి రోజే చూడాలనిపించేంత భరోసా ప్రమోషన్ కంటెంట్ ఇవ్వలేదు. సో గేరు మార్చే టైం వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates

