సరస్వతి పవర్ భూములపై పవన్ ఫోకస్

ఏపీ మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ సంస్థ పేరు కొద్ది రోజులుగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల, జగన్ ల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారంలో సరస్వతి పవర్ సంస్థ ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లాలో ఉన్న సరస్వతి పవర్ సంస్థ భూములపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న ఆ సంస్థ భూములకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని పల్నాడు జిల్లా యంత్రాంగంతోపాటు, అటవీ, పర్యావరణ శాఖ అధికారులను పవన్ ఆదేశించారు. జగన్ కు చెందిన సరస్వతీ పవర్ సంస్థకు 1515 ఎకరాల భూమి ఉందని, అందులో అటవీ సంపదతో పాటు వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగంతో చర్చించిన పవన్ కళ్యాణ్ ఆ భూముల్లో ప్రభుత్వ భూములు, జలవనరులు ఎంతవరకు ఉన్నాయో తెలియజేయాలని ఆదేశించారు.

దాంతోపాటు ఆ భూముల్లో అటవీ భూమి ఎంత ఉందో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాగులు, వంకలు, కొండలు ఆ భూముల్లో ఉన్నందున వాటికి పర్యావరణ అనుమతులు ఏ విధంగా ఇచ్చారె తెలియజేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డును పవన్ ఆదేశించారు. ఈ వ్యవహారంపై అటవీ, రెవెన్యూ, పిసిబి ఉన్నతాధికారులతో త్వరలోనే పవన్ కళ్యాణ్ సమీక్ష జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం చూస్తుంటే చివరకు ఆ భూముల అనుమతులు రద్దయే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా జగన్ ఆస్తిపై పవన్ ఫోకస్ పెట్టడంతో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి ఏర్పడింది.