పవన్ టార్గెట్ లో క్లారిటీ పెరిగిందా?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఆ పార్టీ స్థానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు పవన్‌ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్న మేధావుల అభిప్రాయాలను తన ట్విట్టర్ ఖాతాలో జత చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలను పవన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఉండవల్లి వంటి రాజకీయ ఉద్దండులు మాట్లాడిన మాటలను బట్టి.. ఆర్థిక తీవ్రతను అర్థం చేసుకోవచ్చనిపేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై పవన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఉండవల్లి ఏపీ ఆర్థిక స్థితిగతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఉండవల్లి తప్పుబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు ఉండవల్లి వ్యాఖ్యలను పవన్ అస్త్రంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆయుధంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పవన్ సిద్ధమవుతున్నారనే సంకేతాలు పంపుతున్నారు.

ఏపీ ఆర్థిక సంక్షోభంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ సమావేశంలో మేధావుల అభిప్రాయాలను తీసుకుని సుదీర్ఘ కార్యాచరణ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలనే భావనలో జనసేనాని ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎం జగన్, మంత్రులపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించిన పవన్… ఇప్పుడు తన రూటును మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ దృష్టిని కేందీకరించినట్లు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్టోబర్ 2న జనసేన నిర్వహించిన శ్రమదాన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఇదే కోవలో పవన్ మరింత దూకుడు పెంచారు.

మరోవైపు 2024 లక్ష్యంగా ఏపీలో కుల రాజకీయాల ప్రాధాన్యతను పవన్ తెరపైకి తెస్తున్నారనే చర్చ సాగుతోంది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే ఆయన.. కులాలను ఆకర్షించే స్థాయిలో వ్యాఖ్యానించటం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కులాలకు, మతాలకు అతీతమన్న పవన్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాపు, తెలగ, ఒంటరి, బలిజలు పెద్దన్న పాత్ర పోషిస్తే మార్పు తధ్యమని ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టిస్తున్నాయి. వైసీపీ కమ్మ సామాజిక వర్గాన్ని వర్గ శత్రువుగా ప్రకటించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని విమర్శించారు. కుల రాజకీయాలను తెరపైకి తెస్తున్నారనే చర్చ జరుగుతోంది.