విశ్వంభరకు రాములమ్మ ‘నో’

ఒకప్పుడు 90 దశకంలో చిరంజీవి – విజయశాంతి బ్లాక్ బస్టర్ పెయిర్. పోటాపోటీగా నటిస్తూ డాన్సులు చేస్తూ ఎన్ని హిట్లు అందుకున్నారో ఠక్కున చెప్పడం కష్టం. వీళ్లిద్దరూ చివరిసారి తెరమీద కనిపించింది 1994 మెకానిక్ అల్లుడులో. అది ఎంత పెద్ద డిజాస్టర్. తర్వాత ఈ కలయిక సాధ్యం కాలేదు. వేర్వేరు పార్టీలు, నేపధ్యాలతో ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో పాటు పలు అభిప్రాయ భేదాలు రావడంతో ఎక్కడా కలుసుకున్న దాఖలాలు కనిపించలేదు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆత్మీయంగా పలకరించుకున్నారు కానీ అది అక్కడికే పరిమితమయ్యింది.

తాజాగా విశ్వంభరలో ఆవిడకో పాత్ర ఆఫర్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రతిపాదన వెళ్లిన మాట నిజమే కానీ ఆవిడ సున్నితంగా నో చెప్పారని ఇన్ సైడ్ టాక్. కారణాలు లేకపోలేదు. ఒకప్పుడు మెగాస్టార్ జోడిగా ఆడిపాడిన తాను వర్తమానంలో ఆయన త్రిషతో డాన్సులు చేస్తుంటే ఇలా ప్రత్యేక పాత్రకు పరిమితం కావడం బాగుండదని, పైగా తమ జంట ప్రేక్షకుల మనస్సులో ఎలా ముద్రించుకుపోయిందో దాన్ని అలాగే ఉండనివ్వమని చెప్పారట. గతంలో బిగ్ బాస్ లో మాధవి, గ్యాంగ్ లీడర్ లో సుమలత లాంటి వాళ్ళు ఎస్ చెప్పడం వల్ల పెద్దగా ప్రయోజనం దక్కని మాట వాస్తవం.

ఇదంతా ఎలా ఉన్నా సరిలేరు నీకెవ్వరు టైంలోనే ఈ ఒక్క సినిమా తప్ప తిరిగి తాను నటించనని విజయశాంతి స్పష్టంగా చెప్పారు. మళ్ళీ నిర్ణయం మార్చుకోవడమంటూ ఉండదని కుండ బద్దలు కొట్టారు. సో చిరునే కాదు భవిష్యత్తులో ఇంకెవరు అడిగినా ఎస్ చెప్పకపోవచ్చు. అసలే తెలంగాణ రూలింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి కీలక సభ్యురాలు. పొలిటికల్ గా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో షూటింగుల్లో బిజీ కావాలనుకోరు. ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప రాక్షసుడుతో రాములమ్మ కాంబినేషన్ చూడటం దాదాపు అసాధ్యమే.