సుడిగాడు 2 అంటే పెద్ద సవాలే 

రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా అంత మార్కెట్ ని ఎంజాయ్ చేసింది అల్లరి నరేషే. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆయనలా డైరెక్టర్ కాకపోయినా యాక్టర్ గా తక్కువ టైంలోనే పేరు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా సీరియస్ పాత్రలకు షిఫ్ట్ అయిపోయిన అల్లరోడు మొదట్లో మంచి ఫలితాలు అందుకున్నా ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫలితాలు నిరాశ పరిచాయి. తాజాగా ఆ ఒక్కటి అడక్కుతో తిరిగి తన పాత స్కూల్ కు వస్తున్నాడు. మే 3 విడుదల కాబోతున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ మీద మంచి అంచనాలున్నాయి. 

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో సుడిగాడు 2 ప్రస్తావన వచ్చినప్పుడు సీక్వెల్ రాసే పనులు మొదలయ్యాయని, తానే చూసుకుంటున్నట్టు అల్లరి నరేష్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సుడిగాడు వచ్చి  12 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పట్లో ఈ స్పూఫ్ కామెడీని జనాలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. 20 కోట్లకు పైగా వసూలు చేయడం మాములు విషయం కాదు. కొన్ని మెయిన్ సెంటర్స్ లో బ్లాక్ టికెట్లు అమ్ముడుపోయే రేంజ్ లో హిట్ అయ్యింది. దీని ప్రభావం వల్లే దర్శకులు మరిన్ని స్పూఫులతో అల్లరోడి కెరీర్ ని ఫ్లాపులతో కిందకు తీసుకొచ్చారు. 

ఇప్పుడు అదే టెంప్లేట్ పని చేయదు. ఎందుకంటే ఈ ఫార్ములాని తమ అవసరాలకు అనుగుణంగా స్టార్ హీరోలు సైతం వాడేశారు. ఒకరకంగా చెప్పాలంటే రొటీన్ అయిపోయింది. సో సుడిగాడు చాలా స్పెషల్ అనిపించాలి. దశాబ్ద కాలంలో వచ్చిన మార్పులు, జబర్దస్త్ తరహా హాస్యానికి అలవాటు పడ్డ జనాల అభిరుచులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సో అల్లరి నరేష్ ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తున్నాడనేది కీలకంగా మారుతుంది. ఆ ఒక్కటి అడక్కు కనక బ్లాక్ బస్టర్ అయితే టెన్షన్ ఉండదు. దానికి అనుగుణంగానే సుడిగాడు 2లో ఏమేం ఉండాలో డిసైడ్ చేసుకోవచ్చు.