పెమ్మ‌సాని కి చాలా పౌరుషం గురూ

జ‌గ‌న్ .. సంపాద‌న‌ను నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని అంతా(సీబీఐ) అంటున్నారు. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దు అని టీడీపీ ఎన్నారై నాయ‌కుడు, గుంటూరు పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్నిక‌ల్లో దిగేందుకు.. త‌నకు మాతృభూమిపై ఉన్న ఆపేక్షే కార‌ణ‌మ‌ని తెలిపారు. అందుకే..తాను మూడు ద‌శాబ్దాలుగా అమెరికాలో ఉన్నప్ప‌టికీ.. అక్క‌డ గ్రీన్ కార్డు కోసం అప్ల‌య్ చేయలేద‌న్నారు.

రాజ‌కీయాల్లో ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు ఉండ‌డం స‌హ‌జ‌మే అయినా.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాద‌ని పెమ్మ‌సాని చెప్పారు. చంద్ర‌బాబు పై వైసీపీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు వింటే న‌రాలు తెగేంత కోపం వ‌స్తోంద‌న్నారు. రాజ‌కీయాల్లో ఒక‌రికొక‌రు గౌర‌వించుకునే వాతావర‌ణం ఒక‌ప్పుడు ఉండేద‌ని.. కానీ, ఇప్పుడు కొంద‌రు నాయ‌కులు, కొన్ని పార్టీల కార‌ణంగా ఈ వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింద‌న్నారు. ఎన్నిక‌ల్లో తాను గెలుస్తాన‌న్న న‌మ్మకం ఉంద‌ని.. ఒక ల‌క్ష్యంతో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నాన‌ని పెమ్మ‌సాని చెప్పారు. అయితే.. ఆ ల‌క్ష్యం ఏంటో ఎన్నిక‌లు అయ్యాక చెబుతాన‌న్నారు. గుంటూరును అన్ని విధాలా అభివృద్ధి చేసే ప‌క్కా ప్ర‌ణాళిక త‌న ద‌గ్గ‌ర ఉంద‌న్నారు.

రాజ‌కీయాల్లో నోరుంద‌ని.. అధికారం ఉంద‌ని.. నాయ‌కులు రెచ్చిపోతే.. వారికి స‌రైన స‌మాధానం చెప్పేందుకు వ్య‌వ‌స్థ‌లు కూడా ఉన్నాయ‌ని.. గ‌త ఐదేళ్ల‌లో అనేక సంద‌ర్భాల‌లో నిరూపితం అయింద‌న్నారు. ర‌ఘురామ‌కృష్ణ‌రాజును కొట్టిన‌ట్టు.. త‌న‌పై ఎవ‌రైనా చేయేస్తే.. వారి చెయ్యి న‌రికేసిన త‌ర్వాత‌.. స‌మాధానం చెబుతాన‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్య‌క్తిని కొట్టడం అనేది చట్టానికి వ్యతిరేకం. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి న‌న్ను కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తే.. వాడి చెయ్యి తీసేసిన త‌ర్వాత‌.. స‌మాధానం చెబుతా అని పెమ్మ‌సాని హెచ్చ‌రించారు.

త‌న ద‌గ్గ‌ర డ‌బ్బుంద‌ని ఎన్నిక‌ల పోరులో పాల్గొన‌లేద‌ని.. ఒక అవ‌కాశం వ‌చ్చింది కాబ‌ట్టి.. సొంత భూమికి ఏమైనా చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చంద్ర‌శేఖ‌ర్ చెప్పారు. గ‌త 2019లోనే తాను ప్ర‌య‌త్నించాన‌ని.. కానీ, అప్ప‌ట్లో కుద‌ర‌లేద‌న్నారు. త‌న‌కు రాజ‌కీయాల్లో ఎవ‌రూ శ‌త్రువులు లేర‌న్నారు. త‌న స్నేహితులు గుంటూరు ప్ర‌జ‌లు, ఏపీ ప్ర‌జ‌లేన‌ని, వారికి సేవ చేసేందుకే తాను వ‌చ్చాన‌ని పెమ్మ‌సాని వివ‌రించారు. ఈ పోరులో గెలుపు ఓట‌ముల కంటే కూడా.. ప్ర‌జ‌ల కోసం ఎవరు ప‌నిచేస్తున్నార‌న్న విష‌యాన్ని ప‌రిశీలించాలి. వారిని గెలిపించాలి అని పెమ్మ‌సాని పిలుపునిచ్చారు.