ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ఉండ‌దా..?


ఒకే ఒక్క ఓట‌మి వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వైసీపీ ఓడిపోవ‌డంతో ఆ పార్టీలోనూ నాయ‌కులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు కొంద‌రు నాయ‌కులు త‌మ ర‌క్ష‌ణ తాము చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఉత్త‌రాది నాయ‌కులు.. మ‌రింత ముందుగా సేఫ్ దారులు వెతుక్కుంటున్న‌ట్టు వైసీపీలోనే చ‌ర్చ‌గా మారింది. తాజాగా జ‌రిగిన ఎన్నికల్లో వైసీపీ మూడు ప్రాంతాల్లోనూ ఘోర ప‌రాజ‌యం పాలైంది. చ‌రిత్ర‌లో ఎన్న‌డూలేని విధంగా ఓడిపోయింది.

మొత్తం పదకొండు అసెంబ్లీ సీట్లు వ‌చ్చాయి. వీటిలో 7 రాయలసీమలో వచ్చాయి. రెండు ప్రకాశం జిల్లాలో వచ్చాయి. రెండు మాత్రం విశాఖ జిల్లాలో వచ్చాయి. ఈ రెండు మాత్రమే కోస్తా, ఉత్తరాంధ్రలో కలిపి వైసీపీ ద‌క్కించుకున్న స్థానాలు. అయితే ఆ 2 కూడా అరకు, పాడేరుకే ప‌రిమిత‌మ‌య్యాయి. ఇవి రెండూ కూడా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలే. వాటిలోనూ అంతంత మాత్రమే ఫలితం వచ్చింది. విజయనగరంలో మెజార్టీ సీట్లు సాధిస్తామని విశాఖ, శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెజార్టీ కాకపోయినా.. మెరుగైన సీట్లు సాధిస్తామని వైసీపీ నేతలు అనుకున్నారు.

అయితే.. వారు ఊహించ‌ని రీతిలో ఎదురు దెబ్బ‌త‌గిలింది. చిత్రం ఏంటంటే… సాధారణ ఓటమి అయితే మరోసారి గెలుస్తామన్న ఆశ ఉండేది. కానీ ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కూటమి నేతల మెజార్టీలు చూస్తే వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. గాజువాక, భీమిలి నియోజ‌క‌వ‌ర్గాల్లో 90వేలకుపైగా మెజార్టీలు వచ్చాయి. విశాఖ నార్త్, సౌత్ నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన అభ్యర్థుల మెజార్టీలు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో వ‌చ్చాయి.

గట్టి పోటీ ఉందని భావించిన పలాసలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు పాతిక వేల మెజార్టీ వచ్చింది. ఇక‌, ఫలితాలు వచ్చిన రెండు రోజులకే ఉత్తరాంధ్ర, కోస్తాలోని కొంత మంది నేతలు జనసేన నాయకత్వంతో టచ్ లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. పాత పరిచయాలు, ఇతర రాజకీయ , వ్యక్తిగత సంబంధాలతో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ తరపున పోటీ చేసిన కొంత మంది అభ్యర్థులు మరో వారంలోనే జనసేన పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. ఇదే జ‌రిగితే.. ఖ‌చ్చితంగా ఉత్త‌రాంధ్ర‌లో జెండా మోసే నాయ‌కుడు కూడా వైసీపీకి క‌రువ‌వుతారని అంటున్నారు ప‌రిశీల‌కులు.