‘టీడీపీ-బీజేపీ బంధంపై దుష్ప్ర‌చారం.. వెధ‌వ‌ల్లారా’

ప్ర‌స్తుతం కేంద్రంలోని బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈబంధంపై కొంద‌రు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ఈ పొత్తు ఉండేది కాద‌ని చంద్ర‌బాబే వ్యాఖ్యానించిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నారు. దీనిని ప్ర‌స్తావిస్తూ.. చంద్ర‌బాబు తాజాగా తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో మాది తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు తప్పుడు వార్తలు చేరవేస్తున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే మాయగాళ్లు వచ్చారు. వెధవల్లారా… మీకు సిగ్గులేదు… ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి. ఫేక్ వార్తలతో అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారు. వీటిని మీరు న‌మ్మొద్దు” అని చంద్ర‌బాబు అన్నారు.

“ఇవాళ పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. ‘వివేకం’ అని ఎవరో ఒక సినిమా తీశారు. ఆ సినిమా చూడండి మీరు. మీలో ఆ సినిమా ఎంత మంది చూశారు? ప్యాలెస్ గుట్టు తెలిసిందా? మీరు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు… మీకన్నీ తెలుసు తమ్ముళ్లూ… కానీ ముందుకు రారు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఇక, తన ప్రసంగం ముగించిన అనంతరం చంద్రబాబు… సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ డీజే బాక్సుల్లోంచి వస్తున్న పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.