మోహన్ బాబుని మిస్ చేసిన మహేష్ బాబు

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడా రాడానే దాని మీద ఎక్కువ డిబేట్స్ జరుగుతున్నాయి. రాక గురించి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక వీడియో బైట్ ద్వారా వాటిని కొంత తగ్గించే ప్రయత్నం చేశారు సూపర్ స్టార్. ఈ క్రమంలో నటీనటులకు, దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు అశ్విని దత్ – కిరణ్ తదితరులకు శుభాకాంక్షలు అందజేసి హిట్టవ్వాలని కోరుకున్నారు.

ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ శ్రీనివాస మంగాపురంలో ఒక కీలక పాత్ర పోషించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి గురించి ప్రస్తావించడం మహేష్ బాబు మర్చిపోయాడు. అలాని వీళ్ళ మధ్య బాండింగ్ లేదని కాదు. మహేష్ చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడే కొడుకు దిద్దిన కాపురం లాంటి వాటిలో మోహన్ బాబు ప్రతినాయక పాత్రలు పోషించారు. కృష్ణ గారితో కూడా అనుబంధం ఉండేది. అలాంటిది ఆయన గురించి చెప్పకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తడం సహజం.

కారణాలు ఏమైనా, ఏది ఎలా ఉన్నా ఈ మూవీకి మోహన్ బాబు క్యారెక్టర్ చాలా ప్లస్ అవుతుందనేది యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. జయకృష్ణ ఘట్టమనేనికి గ్రాండ్ వెల్కమ్ వచ్చేలా టీమ్ చేస్తున్న ప్రమోషన్లు కొలిక్కి వస్తున్నాయి. ప్రీ రిలీజ్ వేడుకతో గుమ్మడికాయ కొట్టేసి పబ్లిసిటీకి శుభం కార్డు వేయబోతున్నారు. సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రశ తదాని ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతోంది. లుక్స్ గట్రా బాగానే ఉన్నాయి మరి.

పేరు, ప్రోమోలు ప్రేమకథనే ఫీలింగ్ కలిగించినా ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట. ఫ్యాక్షనిజంతో పాటు ఎలేవేషన్లు, కుట్రలు కుతంత్రాలు, మాస్ అంశాలు అన్నీ పొందుపరిచి అజయ్ భూపతి కంప్లీట్ ప్యాకేజీగా రూపొందించారని సమాచారం. తండ్రి రమేష్ బాబు సోలో హీరోగా మిస్ చేసుకున్న స్టార్ డం జయకృష్ణ రూపంలో తీరాలనేది కృష్ణ గారు బ్రతికి ఉన్నపుడు కోరుకున్నారు. ఇప్పుడది నిజమైతే ఆ ఫ్యామిలీకి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.