టీడీపీ 144, జ‌న‌సేన 21, బీజేపీ 10

టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ మిత్ర ప‌క్షం మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు ఒక కొలిక్కి వ‌చ్చింది. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించిఈ మూడు పార్టీలూ.. సుదీర్ఘంగా 8 గంట‌ల పాటు చ‌ర్చించిన ద‌రిమిలా.. అనేక మార్పులు, చేర్పుల అనంత‌రం సీట్ల పంప‌కాల‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం.. అసెంబ్లీలోని 175 స్థానాల‌కు గాను టీడీపీ 144, జ‌న‌సేన 21, బీజేపీ 10 స్థానాల్లోనూ పోటీ చేయ‌నుంది. ఇక‌, పార్ల‌మెంటు స్థానాల‌కు సంబంధించి ఏపీలో 25 లోక్‌స‌బ సీట్లు ఉన్నాయి. వీటిలో టీడీపీ 17 చోట్ల పోటీ చేయ‌నుండ‌గా, బీజేపీ ఆరు స్థానాలు, జ‌న‌సేన రెండు చోట్ల బ‌రిలోకి దిగ‌నున్నాయి.

సుదీర్ఘ క‌స‌ర‌త్తు

కీలకమైన తొలి భేటీ మూడు పార్టీల‌కు అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు మ‌ధ్య‌లో మూడు గంట‌ల విరామంతో మొత్తం 8 గంటల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. అనేక ఈక్వేష‌న్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. మ‌ధ్య‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ‌ర్చువ‌ల్‌గా ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. దీంతో బీజేపీ ఒత్తిడి మేర‌కు టీడీపీ ఒక‌ సీటు, జనసేన మూడు సీట్లు త‌గ్గించుకుని బీజేపీకి అసెంబ్లీ స్థానాల్లో మరో 4 సీట్లు ఇచ్చాయి. మొత్తంగా సీట్ల‌పై చ‌ర్చ ముగిసింది. ఇక‌, మంగళవారం అభ్యర్థులపై భేటీ అయి తేల్చ‌నున్నారు.

కూటమి సమావేశం ముగిసిన అనంతరం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండాలు నోవాటెల్ హోటల్ కు వెళ్లిపోయారు. భేటీలో పాల్గొన్న ఇతర టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు నివాసం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై మ‌రికొంత సేపు చర్చించారు. మరోవైపు షేకావత్, పాండాలు బీజేపీ అధిష్టానానికి భేటీ సారాంశాన్ని వివరించారు. ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గైర్హాజరయ్యారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు.