చంద్రబాబు అన్నం తింటున్నాడా.. గడ్డి తింటున్నాడా: జగన్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, తన కొడుకు ఆరవ్ ను తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది.

దీంతో, రిమాండ్ లో ఉన్న అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ ఈ రోజు శ్రీకాకుళంలో పర్యటించారు. అయితే, జగన్ రోడ్ షో చేసుకుంటూ జైలు వద్దకు చేరుకునే సరికి ములాఖత్ సమయం అయిపోయింది. దీంతో, జైలు దగ్గర కాసేపు నాటకీయ పరిణామాల అనంతరం బెయిల్ పై విడుదలైన ఆరవ్, అప్పల రాజు సతీమణిని జగన్ పరామర్శించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ యథా ప్రకారం పిల్లాడు ఆరవ్ తెలియక యాక్సిడెంట్ చేస్తే మర్డర్ కేసు పెడతారా అంటూ పాత పాటే పాడారు. ఈ పిల్లాడి జీవితాన్ని నాశనం చేయాలని చూశారని, ఇదేం ప్రభుత్వంమని ప్రశ్నించారు.

ఇక, సీఎం చంద్రబాబుకు 80 ఏళ్ల వయసు దగ్గరపడుతోందని, చంద్రబాబు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. అంతేకాదు, టీడీపీ నేతలు, వారి పిల్లలు, బంధువులు యాక్సిడెంట్ లు చేస్తే ఈ మాదిరిగానే హత్యాయత్నం కేసు పెడతారా అంటూ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. యాక్సిడెంట్ చేసిన కొడుకును తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించడం ఒక నేరం, కాబట్టి అతడిని అరెస్ట్ చేశారు. అప్పలరాజు ఏదో ఘనకార్యం చేసిన వాడిలాగా ఆయనను జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం పెద్ద కామెడీ. ఇక, పరామర్శకు వెళుతూ నాలుగు గంటల పాటు ఎన్నికల ప్రచారం మాదిరి రోడ్ షో చేస్తూ జగన్ వెళ్లడం అంతకన్నా పెద్ద కామెడీ. చివరకు టైం అయిపోవడంతో అప్పల రాజును కలవకుండానే జగన్ వెనక్కి వెళ్లడం ఈ ఎపిసోడ్ కే హైలైట్.