రాత్రికి రాత్రే సెకండ్ హాఫ్ ఎడిటింగా?

ఒక సినిమాకు డివైడ్ టాక్ ఉన్నపుడు, లెంగ్త్ గురించి విమర్శలు వచ్చినపుడు కొన్ని సన్నివేశాల్లో కోత విధించడం మామూలే. ఈ నెల మొదట్లో విడుదలైన ‘నాగబంధం’ సినిమా నుంచి టీం 20 నిమిషాల దాకా కోత పెట్టడం తెలిసిందే. ఐతే ఇలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన సన్నివేశాలను కట్ చేయడం మామూలే కానీ.. రిలీజ్ తర్వాత సినిమాను ఎడిట్ చేసి మెరుగులు దిద్దడం అరుదు. తాను అదే పని చేసినట్లు ‘చెన్నై లవ్ స్టోరీ’ రచయిత- నిర్మాత సాయిరాజేష్ చెప్పడం విశేషం. ఈ విషయం ఎవరికీ తెలియదు అంటూ ఈ మూవీ సక్సెస్ మీట్లో వెల్లడించాడు. 

‘చెన్నై లవ్ స్టోరీ’కి విడుదలకు ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయగా.. అక్కడ్నుంచి కొంత డివైడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ద్వితీయార్ధం విషయంలో చాలామంది విమర్శలు గుప్పించారు. ఐతే ఈ ఫీడ్ బ్యాక్ తీసుకుని.. వెంటనే అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లిపోయినట్లు సాయిరాజేష్ తెలిపాడు. అర్ధరాత్రి తర్వాత ఎడిటర్‌తో కూర్చుని కరెక్షన్లు చేసి, మార్నింగ్ షోలకు సినిమాను ఇంకా బెటర్ ఔట్‌పుట్‌తో రిలీజ్ చేశామని.. ఈ మార్పులు జరిగినట్లు కూడా ఎవ్వరికీ తెలియదని సాయిరాజేష్ తెలిపాడు.

ఐతే సాయిరాజేష్ చేసిన మార్పులు ఏంటో.. ముందు రోజు ప్రిమియర్ చూసి, తర్వాత రెగ్యులర్ షో కూడా చూసిన వాళ్లకే తెలియాలి. ఐతే ద్వితీయార్ధంలో కొంత సమస్య ఉన్నప్పటికీ సినిమాను ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. తొలి వీకెండ్లో అంచనాలను మించి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. వీక్ డేస్‌లో కూడా బలంగానే నిలబడుతోంది. ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే బయ్యర్లందరూ బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పట్టారు. ఫుల్ రన్లో ‘చెన్నై లవ్ స్టోరీ’ రూ.50 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే అవకాశముంది.