ఈ తమ్ముడు బాగా కష్టపడాల్సిందేనా ?

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బాగా కష్టపడాల్సిన నియోజకవర్గాల్లో కడప జిల్లాలోని రాయచోటి కూడా ఒకటి. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి నాలుగుసార్లు వరుసగా గెలుస్తునే ఉన్నారు. ఐదోసారి కూడా గెలిచే విషయంలో గడికోట బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ మీద తెలుగుదేశంపార్టీ తరపున మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పోటీచేయబోతున్నారు. చాలాకాలంగా నియోజకవర్గంలో కష్టపడుతున్న ప్రచారం చేసుకుంటున్న నేతలను కాదని చంద్రబాబు నాయుడు ఎందుకో రామ్ ప్రసాద్ కు టికెట్ ఇచ్చారు.

చంద్రబాబు సెలక్షన్తోనే పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఎలాగంటే చాలాకాలంగా రమేష్ రెడ్డి, ద్వారకనాధరెడ్డి టికెట్ కోసం ఎప్పటినుండో గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గం ఇన్చార్జి కాబట్టి తనకే టికెట్ వస్తుందని రమేష్ రెడ్డి అనుకున్నారు. టికెట్ ఖాయమని అనుకోబట్టే నియోజకవర్గంలో బాగా కష్టపడ్డారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కాని అభ్యర్ధుల ప్రకటనలో రామ్ ప్రసాద్ రెడ్డి కనబడింది. దాంతో టికెట్ దక్కని రమేష్ రెడ్డి, ద్వారకనాధరెడ్డి పార్టీ మీద మండిపోతున్నారు.

టికెట్ ప్రకటించిన తర్వాత రమేష్ పై ఇద్దరు నేతల ఇళ్ళకు వెళ్ళి కలిశారు. తనకు మద్దతుగా పార్టీ గెలుపుకోసం పనిచేయమని అడిగితే వాళ్ళు కుదరదుపొమ్మని చెప్పేశారని పార్టీవర్గాల టాక్. దాంతో ఇపుడు రమేష్ కు ఏమిచేయాలో అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో జనసేన నుండి కూడా ఇద్దరు ముగ్గురు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేసుకున్నా ఉపయోగంలేకపోయింది. జనసేన నేతలను పక్కనపెట్టినా టీడీపీ నేతల వ్యతిరేకతే రమేష్ కు ఎక్కువ నష్టం చేస్తుంది.

అందుకనే నియోజకవర్గంలోని పరిస్ధితిని రమేష్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే అచ్చెన్నాయుడు అసంతృప్తనేతలతో మాట్లాడినా పెద్దగా ఉపయోగం కనబడలేదట. గడికోటకు రెడ్డి సామాజికవర్గంలోనే కాకుండా ముస్లిం మైనారిటీలు, బీసీ, ఎస్సీల్లో బలమైన పట్టుంది. సంక్షేమపథకాల లబ్దిదారులు తనకే ఓట్లేసి ఐదోసారి గెలిపిస్తారని గడొకోట చాలా నమ్మకంగా ఉన్నారు. గడికోటను ఢీ కొట్టాలంటే రామ్ ప్రసాద్ రెడ్డి మామూలుగా కష్టపడితే సరిపోదు. పార్టీలోని వ్యతిరేకులందరినీ దారికితెచ్చుకుని, జనసేన నేతలతో కోఆర్డినేట్ చేసుకుని బాగా చెమటోడ్చితే కాని గెలుపు నమ్మకం రాదు. మరి ఈ అభ్యర్ధి ఏమిచేస్తారో చూడాలి.