వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ కేసు విచారణను 4 వారాల్లో ముగించేయాలని, తీర్పు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఇంకా సాగదీయడం సరికాదని వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో ఈ కేసులో పూర్వాపరాలను విశ్లేషించి తీర్పు వెలువరించాలని బుధవారం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ఏం జరిగింది?

2019 మార్చి 15 తెల్లవారుజామున వివేకానంద రెడ్డి కడపలోని తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటు అని ప్రచారం చేసినా, ఆయనను గొడ్డలితో నరికి చంపారన్నది సీబీఐ చేసిన దర్యాప్తులో స్పష్టమైంది.

ఈ కేసులో గొడ్డలి తీసుకువచ్చి నరికి చంపిన వారిలో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఇటీవల సీబీఐ అధికారులు తుది చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు.

అయితే తమకు ఇంకా అనుమానాలు ఉన్నాయని, విచారణ కొనసాగాల్సి ఉందని వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై కూడా కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ మళ్లీ దర్యాప్తు చేసింది. తాజాగా సీబీఐ మరో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను కూడా దాఖలు చేసింది. ఇక విచారించేందుకు ఏమీ స్కోప్ లేదని, అందరినీ విచారించామని, ఉన్న ఆధారాలు ఇవేనని తేల్చి చెప్పింది.

దీనిపై మరోసారి సునీత బుధవారం పిటిషన్ వేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ వాదనలతో ఏకీభవించింది.

“మీకు ఇంకా సందేహాలు ఉంటే ట్రయల్ కోర్టును ఆశ్రయించండి” అని సునీతకు సూచించింది. ఇదే సమయంలో సీబీఐ విచారించేందుకు ఇంకా ఏమీ లేదని చెబుతున్న నేపథ్యంలో ఈ కేసులో నాలుగు వారాల్లో తుది తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.

దీంతో ఈ కేసులో ఇక తదుపరి విచారణలు ముగిసినట్టేనని పరిశీలకులు అంటున్నారు. తీర్పు ఎలా ఉంటుంది? ఎవరిని దోషులుగా పేర్కొంటారు? అన్నది చూడాలి.