లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం లేదని, ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్ష ఎంపీలు ఆరోపించడం కొత్త కాదు. గతంలోనూ పలువురు స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.
అయితే ఈ తీర్మానం నెగ్గుతుందా అంటే నెగ్గదు. కానీ ప్రతిపక్షాలకు ఈ తీర్మానం ద్వారా తమ వాదనను వినిపించే అవకాశం లభిస్తుంది. స్పీకర్ వైఖరిపై తమ అభిప్రాయాలను సభలో చెప్పే వేదికగా దీనిని ఉపయోగిస్తారు.
ప్రస్తుతం కారణాలివే
ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా ఉన్న ఓం బిర్లా రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపైనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి అవిశ్వాసం ప్రకటించింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
1) రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం
ప్రస్తుతం రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఈ హోదా ఉన్న వ్యక్తికి ప్రధాన మంత్రి ఎంతసేపు మాట్లాడతారో అంతసేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలని విపక్షాలు చెబుతున్నాయి. కానీ రాహుల్ గాంధీకి సభలో మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు.
2) మహిళా ఎంపీలను అవమానించారన్న ఆరోపణ
ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాన మంత్రి లోక్సభలో మాట్లాడాల్సి ఉంది. అయితే ఆయన తొలి దశ సమావేశాల్లో లోక్సభకు రాకుండా రాజ్యసభలోనే ప్రసంగించారు.
దీనిపై లోక్సభలో ఎంపీలు ప్రశ్నించగా, స్పీకర్ స్పందిస్తూ ప్రధానమంత్రికి లోక్సభలో ప్రాణహాని ఉందని, ముఖ్యంగా మహిళా ఎంపీలు దాడి చేసే అవకాశం ఉందని సమాచారం ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి.
ఇది మహిళా ఎంపీలను అవమానించడమేనని ప్రియాంక గాంధీ సహా విపక్ష మహిళా ఎంపీలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates