కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క నేత హ‌రీష్‌రావులు…తీవ్ర అంత‌ర్మ‌థ‌నంలో కూరుకుపోయారా?  ప్ర‌స్తుతం అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు ఇచ్చిన `క్లీన్ చిట్`పై ఏం చేయాల‌న్న విష‌యంపై న్యాయ నిపుణుల నుంచి స‌మాచారం సేక‌రిస్తున్నారా?  అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. బీఆర్ ఎస్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ప‌ది మంది ఎమ్మెల్యేలు.. త‌ర్వాత‌.. అధికార పార్టీ కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా మార‌డం త‌ప్ప‌నేది బీఆర్ ఎస్ నాయ‌కులు చెబుతున్నారు. వీరిని అన‌ర్హుల‌ను చేయాల‌ని భావించారు.

కానీ,.. ఈ విష‌యంలో స్పీక‌ర్‌తో మొద‌లు.. సుప్రీంకోర్టు వ‌ర‌కు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నా.. ఆశించిన విధంగా స‌ద‌రు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు ఉండేలా క‌నిపించ‌డం లేదు. పైగా.. వారంతా బీఆర్ ఎస్‌లోనే ఉన్నారంటూ.. స్పీక‌ర్ క్లీన్ చిట్ ఇవ్వ‌డం.. అన‌ర్హ‌త వేటు వేయాల‌న్న పిటిష‌న్ల‌ల‌ను తోసిపుచ్చ‌డం వంటివి బీఆర్ఎస్ ప్ర‌తిష్ఠ‌కు.. భ‌విష్య‌త్తుకు.. కూడా ఇబ్బందిగా మారాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు ఇచ్చిన తీర్పు విష‌యంపై అగ్ర‌నేత‌లు అంత‌ర్మ‌థ‌నంలో కూరుకు పోయారు. ఈ వ్య‌వ‌హారాన్ని ఇక్క‌డితో వ‌దిలేయాలా?  లేక మరింత ముందుకు తీసుకువెళ్లాలా? అనే చ‌ర్చ చేస్తున్నారు.

మ‌హారాష్ట్ర తీర్పుతో..

ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో ప‌లు పిటిష‌న్లు ఉన్నాయి. స్పీక‌ర్‌పై కోర్టు ధిక్కార పిటిష‌న్ కొన‌సాగుతోంది. అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంపైనా విచార‌ణ‌సాగుతోంది. గ‌తంలో మ‌హారాష్ట్రలో జ‌రిగిన వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. అప్ప‌ట్లో శివ‌సేన పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌లేదు. పైగా వారిని స‌మ‌ర్థించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీక‌ర్ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ కేసులోనూ అలానే చేస్తుందా? లేక‌.. ఏదైనా మార్పు ఉంటుందా? అనేది బీఆర్ ఎస్ నాయ‌కుల్లో చ‌ర్చ సాగుతోంది.

వేచి చూస్తున్న కాంగ్రెస్‌!

తాజాగా స్పీక‌ర్ ఇచ్చిన క్లీన్ చిట్‌, సుప్రీంకోర్టులో కేసులు.. త‌దుప‌రి విచార‌ణ‌.. బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్తుంద‌న్న అంశాలను అధికార పార్టీ కాంగ్రెస్ చాలా నిశితంగా గ‌మ‌నిస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు కనుక తీవ్రంగా స్పందిస్తే.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిపై రాజీనామాలు చేయించి.. మ‌ళ్లీఎన్నిక‌ల‌కు వెళ్లే వ్యూహంపైనా నాయ‌కులు చ‌ర్చిస్తున్నారు.

ఇక‌, ఈ విష‌యంలో బీఆర్ ఎస్ కూడా ఇలానే ఉంది. తెగేదాకా లాగితే.. వారితో రాజీనామాలు చేయించే అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా కాంగ్రెస్ బ‌లోపేతం అవుతుంద‌ని భావిస్తున్నారు. ఈ అవ‌కాశం ఇవ్వ‌డం అన‌వ‌స‌ర వ్య‌వ‌హార‌మ‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ విష‌యంపై బీఆర్ ఎస్ పార్టీ నాయ‌కులు తీవ్రంగానే చ‌ర్చిస్తున్నారు.