కెమెరామెన్ పేల్చిన ‘విశ్వంభర’ బాంబులు

విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు అయిపోయినా ఎలాంటి అప్డేట్ లేక ఫ్యాన్స్ నుంచి నిరసన గళం వినిపిస్తోంది. జాప్యానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ అన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో ఈ సినిమా కెమెరామెన్ ఛోటా కె నాయుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే సినిమాల్లో కెమెరామెన్ బాధ్యత తక్కువగా ఉంటుందని, దర్శకులు ఏం కోరుకుంటారో దాన్నే మేమిస్తామని, క్వాలిటీ సరిగా రాకపోతే దానికి ఛాయాగ్రాహకుడిని బాధ్యుణ్ణి చేయడం ఎంత మాత్రం సరికాదని వివరించారు. అంజికి తల ఎత్తుకుని పని చేసిన నేనే ఇప్పుడు విశ్వంభరకు తల వంచుకుని చేయాల్సి వస్తోందని, నాలుగు వందల కోట్ల బడ్జెట్ కాబట్టి నా మాటే చెల్లుబాటు కావాలనే ధోరణి ఇక్కడ పనికి రాదనీ చెప్పి కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

విశ్వంభర నిర్మాణంలో ఉన్న టైంలోనే చోటా వల్లే కొంత సమస్య వచ్చిందనే పుకారు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. దర్శకుడు వసిష్ఠ దాన్ని కొట్టేసినప్పటికీ గాసిప్పులు మాత్రం ఆగలేదు. పరోక్షంగా ఇవాళ చోటా కె నాయుడు దాని గురించి క్లారిటీ ఇచ్చినట్టే. బెస్ట్ అవుట్ ఫుట్ కోసం టీమ్ ఇంకా కష్టపడుతూనే ఉందని, తనవరకు చేయాల్సింది ఇంకేం లేదని కుండబద్దలు కొట్టారు. కాకపోతే తలవంచి పని చేయడమనే మాటే రకరకాల అర్థాలు తీస్తోంది.

చోటా కె నాయుడు చెప్పిన ప్రకారం ఇలాంటి సిజి మూవీస్ కి కెమెరామెన్ తో పాటు ఒక స్పెషలిస్ట్ టెక్నీషియన్ ఉంటాడని, అతని అంగీకారం లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఓకే కాదని చెప్పిన ఇంకో ఝలక్ ఇచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడీ టాపిక్ పుణ్యమాని విశ్వంభర మరోసారి వార్తల్లోకి వచ్చేసింది.

చిరంజీవితో చూడాలని ఉంది, అంజి లాంటి ఎన్నో టాప్ నాచ్ బ్లాక్ బస్టర్స్ కు పని చేసిన ఛోటా కె నాయుడుకి విశ్వంభర విషయంలో ఇలాంటి అనుభవం ఎదురు కావడం విచిత్రం. వసిష్ఠ డెబ్యూ మూవీ బింబిసారకు ఛాయాగ్రహణం అందించింది కూడా ఛోటా కె నాయుడేనన్న విషయం ఇక్కడ మర్చిపోకూడదు.