అక్కడెక్కడో ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు.. హోటళ్లు మూతపడుతున్న దుస్థితి. అవును.. దేశంలో చమురు.. గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నట్లుగా కేంద్రం ఒకవైపు చెబుతుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో ఇంధన కొరత కొత్త టెన్షన్ కు కారణమవుతోంది.
ఇరాన్ యుద్దం మొదలైంది ఫిబ్రవరి 28న అయినప్పటికీ.. వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో మార్చి ఏడో తేదీ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. మార్చి 8న మొదలైన కొరత.. మార్చి తొమ్మిది వచ్చేసరికి.. బెంగళూరుకు చెందిన టిఫిన్ సెంటర్లు.. హోటళ్లను గ్యాస్ బండలు లేకుండా తాము నడపలేమని పేర్కొంటూ తమ దుకాణాల్ని మూసేస్తున్నట్లుగా పేర్కొనటం తెలిసిందే.
రోజు గడిచే సరికి ఇదే తరహా పరిస్థితి ముంబయిలో చోటు చేసుకుంది. ముంబయి హోటల్ అండ్ రెస్టారెండ్ అసోసియేషన్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. గ్యాస్ బండ కొరత కారణంగా దేశ ఆర్థిక రాజధానిలో 20 శాతం హోటళ్లు.. రెస్టారెంట్లు మూతపడినట్లుగా పేర్కొన్నారు.
ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే.. రానున్న రెండు రోజుల్లో ముంబయిలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొన్నారు. ఇంధన కొరత పేరుతో.. గ్యాస్ బండల ధరల్ని విపరీతంగా పెంచేశాయి గ్యాస్ కంపెనీలు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల విషయానికి వస్తే.. ఫిబ్రవరి 28 తర్వాత మార్చిఒకటిన బండకు రూ50 చొప్పున పెరగ్గా.. ఫిబ్రవరి 7 నాటికి ఒక్కో బండ మీద ఏకంగా రూ.500 పెరిగినట్లు హోటల్.. రెస్టారెంట్లు.. టిఫిన్ సెంటర్ల యజమానులు పేర్కొంటున్నారు.
ఇదే అదనుగా గ్యాస్ డీలర్లు పలువురు వాణిజ్య గ్యాస్ బండల్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న పరిస్థితి. బెంగళూరు.. ముంబయి మహానగరాలు సరే.. మరి హైదరాబాద్ సంగతేంటి? అన్నది ప్రశ్న.
తాజాగా, తెలంగాణ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ట్రెజరర్ మిస్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ, నిన్నటి నుంచి వాణిజ్య గ్యాస్ సరఫరాలో తీవ్ర కొరత ఎదురవుతోందని, చిన్న హోటళ్లకు ఒకటి లేదా రెండు రోజుల స్టాక్ మాత్రమే ఉందని, రెండు రోజుల తర్వాత 90% హోటల్ మరియు ఫుడ్ ఇండస్ట్రీ మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ యుద్ధ పరిస్థితి కొనసాగితే భారీ నిరుద్యోగం, ప్రభుత్వానికి జీఎస్టీ వంటి పన్నుల నష్టం, పర్యాటకానికి ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రభుత్వం కనీసం 50% సరఫరా అందించాలని కోరారు. మిగిలినది ఎలక్ట్రిసిటీ లేదా ఇతర ప్రత్యామ్నాయాలతో మేనేజ్ చేసుకుంటామని చెప్పారు.
ఇప్పటివరకు వాణిజ్య సిలిండర్ల పంపిణీలో కాస్త తేడా వచ్చినప్పటికీ.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. టిఫిన్ సెంటర్లు మూసివేసే పరిస్థితికి అయితే రాలేదు. కమర్షియల్ సిలిండర్లకు ఆర్డర్ ఇస్తే.. రెండు.. మూడు రోజులకు కానీ డెలివరీ చేయట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం.. పౌర సరఫరాల శాఖకు చెందిన ప్రముఖులు వాణిజ్య గ్యాస్ బండల విషయంలో ఫోకస్ చేస్తే.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. మరేం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates