చంద్ర‌బాబుదే గెలుపు: ఉండ‌వ‌ల్లి

త‌ర‌చుగా మీడియా స‌మావేశాలు రాష్ట్ర రాజకీయాల‌పై విశ్లేష‌ణ చేసే మాజీ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ తాజాగా.. ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విజ‌యం ద‌క్కించుకుంటార‌ని అన్నారు. “చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయ‌నే గెలుస్తారు. చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌ను చూపిస్తే.. పోలవరం ప్రాజెక్ట్‌ను చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు” అని వ్యాఖ్యానించారు.

ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తాను మీడియా ముందుకు వ‌చ్చిన‌ట్టు అరుణ్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు 70 మంది మాత్రమే విభజన సమయంలో పార్ల‌మెంటుకు హాజరయ్యారని, ప్రాంతీయ పార్టీలన్ని వ్యతిరేకించాయని పేర్కొన్నారు. “ఏపీ విభజన తప్పా, కరెక్టా తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టుని అడుగుతున్నాను. టెర్రరిస్టులు పార్లమెంట్‌పై దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూయలేదు. ఏపీ విభజన సమయంలోనే తలుపులు మూసేశారు” అని అన్నారు. ఇది స‌రైన విధాన‌మేనా? అని నిప్పులు చెరిగారు.

ఇక‌, నిధుల గురించి మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 70 శాతం నిధులు ఇస్తోందన్న ఆయ‌న అదే చేత్తో కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లు పూర్తయినప్ప‌టికీ విభజన హామీ చట్టం అమలు చేయడం లేదని అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల మేర‌కు ఏపీ సీఎంజ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను అమ‌లు చేయ‌డం కోసం.. కేంద్రాన్ని ఏమేర‌కు ప్ర‌శ్నించారో.. చెప్పాల‌ని కోరారు. 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు.. 9 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు.. ఈ దేశంలో ఒక పార్టీకి ఉండ‌డం గొప్ప విష‌య‌మ‌ని.. అయినా.. కూడా ఆయ‌న ఏమీ సాధించ‌లేక పోయార‌ని.. రేపు ఏం చెప్పుకొని ఓట్లు అడుగుతార‌ని ప్ర‌శ్నించారు.