కేంద్ర పోలీసులు పంపండి…సీఈసీకి చంద్రబాబు రిక్వెస్ట్

ఏపీలో మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన లకు చెందిన ఓట్లను వైసీపీ నేతలు తొలగిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం విజయవాడలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సీఈసీ అధికారులతో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని సీఈసీ అధికారులకు తెలిపానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని అరాచకాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, అందుకే హోల్ సేల్ గా ఓటర్లను మార్చడం, దొంగ ఓట్లు వేయడం వంటి కార్యక్రమాలకు అధికార పార్టీ తెరతీసిందని చంద్రబాబు ఆరోపించారు.

లక్షా పదిహేనువేల దరఖాస్తులు ఇస్తే అందులో 33వేల ఓట్లు ఆమోదించారని చెప్పారు. ఈ వివరాలన్నింటినీ అధికారులకు అందించామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమిస్తుంటారని, కానీ, ఏపీలో మాత్రం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో విధులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల విధులకు కేటాయించే అధికారిని సెలక్షన్ విధానంలో కాకుండా అత్యుత్తమ పనితీరు ఆధారంగా ఎంపిక చేయాలని ఎన్నికల సంఘం అధికారులను కోరామన్నారు.

మహిళా పోలీసులను బూత్ లెవల్ ఆఫీసర్లుగా నియమించారని, వారికి ఆ విధులు ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ విషయంపై ప్రశ్నించామన్న కారణంతో టిడిపి నేతలు, జనసేన నేతలపై వేల సంఖ్యలో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికలు జరిగాయా లేదా అన్నట్లుగా సాఫీగా జరిగిపోయాయని, ఏపీలో ఆ పరిస్థితులు లేవని సీఈసీ అధికారులకు వెల్లడించామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తమకు సీఈసీ అధికారులు హామీనిచ్చారని చంద్రబాబు అన్నారు. అవసరమైతే కేంద్ర కేంద్ర పోలీసులను పంపించాలని కోరారు.