కాళేశ్వరం ఫెయిల్యూర్ గా మిగిలిపోవాల్సిందేనా?

కేసీయార్ ఎంతో గొప్పగా ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోయేట్లుంది. ప్రాజెక్టును మొదలుపెట్టింది కోట్ల రూపాయలు దోచుకోవటానికే అని మొదటినుండి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వాళ్ళ ఆరోపణలకు తగ్గట్లే కాళేశ్వరం నిర్మాణంలోని నాణ్యతాలోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోవటం, బ్యారేజి ప్రాంతంలో చీలిక రావటమంతా కేసీయార్ ఫెయిల్యూర్ కు సాక్ష్యంగా నిలుస్తోంది.

తాజాగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన మంత్రులు బృందం కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టేసి ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు ప్రాణంపోస్తామన్నట్లుగా ప్రకటించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుచేసిన కేసీయార్ చివరకు లక్ష ఎకరాలకు కూడా సాగునీరివ్వలేకపోయారంటే మంత్రులు మండిపోయారు. రేవంత్ రెడ్డి ఆలోచనలు, మంత్రుల ప్రకటనలు చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో షోపీస్ ప్రాజెక్టుగా మాత్రమే మిగిలిపోయేట్లుంది. కేసీయార్ హయాంలో ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యానికి గురైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

రెండు ప్రాజెక్టులు కూడా గోదావరి నీటి లభ్యత ఆధారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎగువబాగంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్ధాపన చేసిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును  నిర్మించుంటే వేలకోట్ల రూపాయలు ఆదాఅయ్యుండేవి. కానీ ప్రాణహితను కేసీయార్ పక్కనపెట్టేసి అనవసరంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తుకున్నారు. వైఎస్ హయాంలో రు. 35 వేల కోట్ల అంచనా వ్యయం ప్రాజెక్టును కేసీయార్ సుమారు లక్ష కోట్ల రూపాయలకు తీసుకెళ్ళారు. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకున్నా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వ్యయం సుమారు రు. 39 వేల కోట్లే.

కాళేశ్వరం ఎందుకు షోకేస్ ప్రాజెక్టుగా మారబోతోందంటే అది నాణ్యతా లోపాలతో నిర్మించారన్న విషయం బయటపడింది. పూర్తి స్థాయి 141 టీఎంసీ నీటి నిల్వ చేస్తే ప్రాజెక్టు తట్టుకోలేందని బయటపడింది. అందుకనే ప్రాణహిత ప్రాజెక్టును అత్యంత నాణ్యతతో నిర్మించి కాళేశ్వరానికి బదులుగా వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రులు చెప్పారు. అంటే కాళేశ్వరంకు కేసీయార్ చేసిన లక్ష కోట్ల రూపాయల వ్యయం బూడిదలో పోసినట్లుగా తయారవ్వబోతోంది. అందుకనే కేసీయార్ ఫెయిల్యూర్+అవినీతిని మొత్తం తెలంగాణా అంతా చాటిచెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది.