కాంగ్రెస్ లో కొత్త స్ట్రాటజిస్టు

తెలంగాణా కాంగ్రెస్ లో సరికొత్త స్ట్రాటజిస్టు కుమ్మరి శ్రీకాంత్ జోరు మొదలైంది. ఇప్పటికే సునీల్ కనుగోలు చాలాకాలంగా వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటకలో కాంగ్రెస్ గెలవటానికి ముందునుండే తెలంగాణా కాంగ్రెస్ కు సునీల్ వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే సునీల్ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్లలోనే వివాదాలున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులపై జరుగుతున్న దుష్ప్రచారానికి వ్యూహకర్త బృందమే కారణమని ఆరోపణలున్నాయి.

కారణాలు ఏవైనా, వివాదాలు ఎలాగున్నా కాంగ్రెస్ కు కాస్త ఊపుతెచ్చారనటంలో సందేహంలేదు. ఇదే సమయంలో కర్నాటకలో ఘన విజయం సాధించటంతో తెలంగాణాలో పార్టీకి బాగా ఊపొచ్చేసింది. సరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఎనిమిది నెలలుగా కుమ్మరి శ్రీకాంత్ కూడా వ్యూహకర్తగానే పనిచేస్తున్నారని పార్టీవర్గాలు చెప్పాయి. పార్టీలో చేరికలు, పాపులర్ సర్వేలు, బీఆర్ఎస్ తప్పిదాలపై కౌంటర్లు, రాహుల్, ప్రియాంకగాంధి స్పీచులు అన్నింటినీ శ్రీకాంతే చూసుకుంటున్నారట.

కాంగ్రెస్ విధానాలను, సిక్స్ గ్యారెంటీలపై సోషల్ మీడియా వేదికగా చేయాల్సిన, జరుగుతున్న ప్రచారం మొత్తాన్ని కుమ్మరే పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. శ్రీకాంత్ ఆధ్వర్యంలోనే గాంధీభవన్లో ఒక వార్ రూమ్ ఏర్పాటైంది. ఇక్కడి నుండే వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫారంలపై కుమ్మరి 24 గంటలు పనిచేస్తున్నారు. 2012 నుండి కాంగ్రెస్ కు వివిధ రాష్ట్రాల్లో పార్ట్ టైమర్ గా పనిచేస్తున్న కుమ్మరి గడచిన ఎనిమిది మాసాలుగా ఫుల్ టైమర్ గా పనిచేస్తున్నారు. స్వయంగా హైదరాబాద్ వాసి అయిన శ్రీకాంత్ కు రెండు తెలుగురాష్ట్రాల్లోని రాజకీయాలపై బాగా పట్టుండటం కాంగ్రెస్ కు కలిసొస్తోందని అనుకుంటున్నారు.

పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు కూడా శ్రీకాంత్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండటం వల్ల తమ నియోజకవర్గాల్లోని పరిస్ధితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ వెనకబడుంది ? వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల పరిస్ధితులు ఏమిటనే విషయమై ప్రతిరోజు సర్వేలు చేయించి విశ్లేషణలు తయారుచేయటమే శ్రీకాంత్ ముఖ్య బాధ్యతలు. గాంధీభవన్ నుండే అవసరమైన నేతలకు శ్రీకాంత్ దిశానిర్దేశం చేస్తున్నారట. మరి కొత్త స్ట్రాటజిస్టు ప్రభావం ఎంతుంటుందో చూడాలి.