కర్ణాటకలో రాహుల్ జోడో యాత్ర‌ నియోజ‌క‌వ‌ర్గాలన్నీ కాంగ్రెస్ కే !!

తాజా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర క‌లిసి వ‌చ్చింది. క‌ర్ణాట‌క‌లో రాహుల్ జోడో యాత్ర సాగిన నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కర్ణాటకలో 7 జిల్లాల్లోని 20 నియోజకవర్గాల మీదుగా గత ఏడాది సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 23 వరకు రాహుల్ భార‌త్ జోడో యాత్ర సాగింది. వాటిలో 15 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గాలు బీజేపీ, జేడీఎస్‌ కంచుకోటలు. మైసూరు జిల్లాలో 5, తుముకూరు జిల్లాలో 4, మాండ్యా, చిత్రదుర్గ జిల్లాల్లో 3 చొప్పున, బళ్లారి, రాయచూర్‌ జిల్లాల్లో 2 చొప్పున, చామరాజనగర జిల్లాలో ఒక నియోజకవర్గంలో రాహుల్‌గాంధీ యాత్ర నిర్వహించారు. ఈ 20 స్థానాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 5 స్థానా లకే పరిమితమవ్వగా బీజేపీ 9 స్థానాలు, జేడీఎస్‌ 6 స్థానాలు గెలుచుకున్నాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గణనీయంగా పుంజుకుని 15 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం 2 స్థానాలకు, జేడీఎస్‌ 3 స్థానాలకు పరిమితమయ్యాయి. మాండ్యా, చిత్రదుర్గ, చామరాజనగర జిల్లాల్లో యాత్ర జరిగిన అన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. భారత్‌ జోడో యాత్ర కర్ణాటక ఎన్నికలపై ప్రభావం చూపడమే కాకుండా కార్యకర్తల్లో పునరుత్తేజం కలిగించింది. ఈ ఏడు జిల్లాల్లో 51 అసెంబ్లీ స్థానాలు ఉండగా 36 చోట్ల కాంగ్రె స్‌ విజయం సాధించింది. బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలను కన్నడిగులు తిప్పికొట్టారని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.