అన్ని దారులు `ధ‌ర్మేంద్ర` వైపే..!

కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని రూపాల్లో ప్ర‌య‌త్నించినా.. విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక‌పోతోంది. ఇప్ప‌టికే బ‌ల ప్ర‌యోగం చేయ‌డంతో ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్ర‌పంచ దేశాలు ఏ స‌మ‌స్య వ‌చ్చినా చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం చూడాల‌ని హిత‌వు ప‌లికే ప్ర‌ధాని మోడీ ఈ విష‌యంలో ఏం చేస్తార‌న్న అంశంపై ప్ర‌పంచ దేశాలు కూడా ఆస‌క్తిగా ఎదురు చూశాయి. ఈ క్ర‌మంలో అతిక‌ష్టం మీద కేంద్ర ప్ర‌భుత్వం విద్యార్థి నేత‌ల‌తో చ‌ర్చ‌ల‌కు దిగింది. ప్ర‌ధానంగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున వ‌చ్చిన ప్ర‌తినిధుల‌తో దాదాపు రెండు గంట‌ల పాటు రెండు విడ‌త‌లుగా చ‌ర్చ‌లు జ‌రిగాయి.

అయితే.. అటు పార్ల‌మెంటులో అయినా.. ఇటు చ‌ర్చ‌ల ద్వారా అయినా ఒక్క‌టే డిమాండ్ ఎటూ ముడిప‌డ‌డం లేదు. నీట్ ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో జ‌వాబుదారీ త‌నం కోరుతున్న విద్యార్థులు, ప్ర‌తిప‌క్షాలు సైతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాకే ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే, ఈ విషయంలో చ‌ర్య‌లు తీసుకుంటే స‌ర్కారుకు బ్యాడ్ నేమ్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్న కేంద్రం దీనిని త‌ప్ప ఇంకేదైనా ప‌రిష్క‌రించేందుకు తాము రెడీ అని సంకేతాలు ఇచ్చింది. తాజాగా శుక్ర‌వారం రెండు ద‌ఫాలుగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లోనూ ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. కానీ, చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దంకాలేదు.

మిగిలిన డిమాడ్ల‌కు మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఓకే చెబుతోంది. వీటిలో 1) నీట్ ప్ర‌శ్న ప‌త్రం లీకై.. ప‌రీక్ష‌ను క్యాన్సిల్ చేసిన నేప‌థ్యంలో ఆందోళ‌న వ్య‌క్తం చేసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సుమారు 22 మంది విద్యార్థుల‌కు కోటి రూపాయ‌ల చొప్పున ప‌రిహారం అందించ‌డం. దీనికి కేంద్రం త‌క్ష‌ణ‌మే అంగీక‌రించింది. అయితే.. బ‌హిరంగంగా కాకుండా.. గుట్టుగా వారి ఖాతాల్లో వేస్తామ‌ని ప్ర‌చారం చేసుకోవ‌డం త‌మ‌కు ఇష్టం లేద‌ని పేర్కొంది. ఇక‌, 2) చ‌లో పార్లెంటు స‌మ‌యం విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు పెట్టిన కేసుల‌ను ఎలాంటి ష‌ర‌తులు లేకుండానే ర‌ద్దు చేయడం. దీనికి కూడా కేంద్ర స‌ర్కారు ఓకే చెప్పింది.

కానీ, అత్యంత కీల‌క‌మ‌ని విద్యార్థులు, పార్ల‌మెంటులో ప్ర‌తిప‌క్షాలు చెబుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనా మాపై మాత్రం కేంద్రం ఏమీ తేల్చ‌లేదు. అయితే.. ఈ విష‌యంపైనే పార్ల‌మెంటు ఉభయ స‌భ‌లు వాయిదాల ప‌ర్వంలో కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు విద్యార్థులు కూడా తమ నిర‌స‌న‌ల‌ను వ‌దిలి పెట్టడం లేదు. ఈ క్ర‌మంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు స‌మ‌యం కావాల‌ని, దీనిపై ప్ర‌ధానితో చ‌ర్చించి త‌గు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చ‌ర్చ‌ల‌కు వ‌చ్చిన కాక్రోచ్ పార్టీ ప్ర‌తినిధుల‌కు కేంద్ర మంత్రులు తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.