ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఇది పెద్ద పరీక్షే. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక ముందడుగు వేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద సవాల్ 36 వేలకుపైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనే. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీల్లో వివిధ స్థాయిల్లో బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన జనసైనికులు, వీరమహిళలు, నాయకుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, ఎంపిక ప్రక్రియను పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
గత నెల 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక సమాచార సేకరణ కమిటీల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అభ్యర్థుల నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవలో చురుకుదనం, రాజకీయ అనుభవం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీలకు ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల కమిటీలను పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మిగిలిన నియోజకవర్గాల కమిటీల ఎంపికను కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీల నియామక ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో సమర్థ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలని జనసేన భావిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates

