జనసేనాని వైఎస్సార్ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు ?

జనసేనానాయకుడు రణస్థలం రెచ్చిపోయారు. ఉత్తరాంధ్ర దద్దరిల్లేలా గంటకు పైగా స్పీచ్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం తూర్పార పట్టేశారు. జగన్ సర్కారును లాగి కింద పడేసే టైమ్ వచ్చిందన్నారు. మంత్రులను ఏకి పడేశారు. మధ్య మధ్యలో తన ఆశయాలు, ఆకాంక్షలను వెల్లడిస్తూ ఆయన ప్రసంగం సాగింది. ఆటిన్ రాజాలు, డైమండ్ రాణిలు ఉంటూ పేకాటలో తన ప్రవేశాన్ని కూడా వివరించారు. జగన్ జైలు జీవితాన్ని, ఖైదీ నెంబర్ ను కూడా ఆయన గుర్తుచేశారు. ఒక ఖైదీకి డీజీపీ సెల్యూట్ చేస్తున్నారన్నారు.

మీటింగ్ పెట్టిందే జగన్ ప్రభుత్వాన్ని తిట్టడానికని వేరే చెప్పాల్సిన పనిలేదు. దత్తపుత్తుడు, ప్యాకేజీ స్టార్ అంటూ నిత్యం విరుచుకుపడుతున్న వైసీపీ నేతలను ఆటాడుకునేందుకు పవన్ కు ఒక అవకాశం వచ్చింది. ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా తిట్టారు. అందులో తప్పు లేదు కూడా. అయిన మధ్యలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎందుకు తెచ్చారన్నదే పెద్ద ప్రశ్న.

ఒక దశలో పవన్ కల్యాణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు తెచ్చారు. జగన్ ను తనివితీరా తిట్టే క్రమంలో ఆయన తండ్రి పేరు ప్రస్తావించారు. వైఎస్సార్ కాలం నుంచే ఉన్నానని ఆయన్నే ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాన్ని సభలో ఉన్న వారు పెద్దగా పట్టించుకోకపోయినా పవన్ ఉద్దేశ పూర్వకంగానే వైఎస్ పేరు ప్రస్తావించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి..

జగన్ ఒక బచ్చా అని చెప్పడం పవన్ ధ్యేయంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ అంతటి నేతతో పోల్చితే జగన్ నథింగ్ అని పవన్ సందేశమిచ్చారని అంటున్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్లుగా తండ్రి పేరు చెప్పుకుని జగన్ అధికారానికి వచ్చారని, నిజానికి ఆయనకు అంత సీన్ లేదని చెప్పడమే పవన్ ఉద్దేశమట. పైగా జగన్ ను చిన్నబుచ్చాలనే వైఎస్ పేరు ప్రస్తావించారు. ఒక గీతను చిన్నది చేయాలంటే మరో పెద్ద గీతను గీయాలన్నట్లుగా ఉందీ పవన్ తీరు.

జగన్ సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. తనపై వైఎస్ ముద్ర లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అందుకే పార్టీ కీలక పదవి నుంచి విజయమ్మను కూడా సాగనంపారు. ఆ సంగతులన్నింటినీ పరోక్షంగా పవన్ ప్రస్తావించినట్లయ్యిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి..