నిన్న అర్జున్… ఇవాళ వరలక్ష్మి

తమిళ దర్శకులకు మన తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలుసు. అందుకే వీలైనంత టాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతిసారి ఫలితాలు వాళ్ళు అనుకున్నట్టుగా రావు. గత నెల యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విడుదలైన ‘సీత పయనం’ ఎంత ఫెయిల్యూరో చెప్పనవసరం లేదు. కూతురు ఐశ్వర్యని ఇక్కడ లాంచ్ చేయాలనే ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

ప్రమోషన్లు, పబ్లిసిటీ, మార్కెటింగ్ ఎంత చేయాలో అంతా చేశారు. కానీ ఫలితం డిజాస్టర్. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నా లాభం లేకపోయింది. మొన్న శుక్రవారం వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ డెబ్యూ చేసిన ‘ఎస్ సరస్వతి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కంటెంట్ పరంగా మెసేజ్ ప్లస్  వైవిధ్యం ఉన్నా ట్రీట్ మెంట్ లోపాల వల్ల ఆడియన్స్ ని మెప్పించలేకపోయిన వైనం కలెక్షన్లలో తేటతెల్లమవుతోంది.

కథా రచయిత సాయిమాధవ్ బుర్రాతో రేగిన వివాదం, అంతా తన భుజాల మీద వేసుకుని వరలక్ష్మి చేసిన ప్రచారం ఇవేవి రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. ఇవాళ నుంచి డ్రాప్ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. సీత పయనం తరహాలోనే ఎస్ సరస్వతిలో కూడా ప్యాడింగ్ ఆర్టిస్టులంతా అగ్రనటులే ఉన్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాధిక, మురళీశర్మ, ప్రియమణితో పాటు ముఖ్యంగా తమన్ సంగీతాన్ని కూడా సపోర్ట్ గా తీసుకున్నారు. కానీ లాభం లేకపోయింది.

సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. తెలుగు ప్రేక్షకులను మెప్పించడం అంత ఈజీ కాదు. ‘లిటిల్ హార్ట్స్’ని బ్లాక్ బస్టర్ చేసినోళ్లే అదే సంస్థ తీసిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’ని తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ని రిజెక్ట్ చేసి ‘ఓజి’ని నెత్తిన బెట్టుకున్నారు. నిన్న అర్జున్, ఇవాళ వరలక్ష్మి, రేపు మరొకరు ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే ఒకటికి పదిసార్లు హోమ్ వర్క్ చేయాల్సిందే. అప్పుడే కోరుకున్న ఫలితాలు, వసూళ్లు దక్కుతాయి.