కేంద్ర‌ బ‌డ్జెట్ లెక్క‌లు.. ఈ ‘సారీ’ ఏపీకి సారీనే…!

కేంద్ర బ‌డ్జెట్ కూర్పు దాదాపు అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. 2023-24 వార్షిక‌బ‌డ్జెట్ కు సంబంధించిన వంట‌కాల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల‌తోనూ చ‌ర్చించి పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. ఇందులో ఏపీకి కూడా ఎంత ఇవ్వాల‌నే విష‌యంపై ఇప్ప‌టికే రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి నివేదిక‌లు పంపించేశారు.

అయితే.. ప్ర‌స్తుతం ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు.. కేంద్ర బ‌డ్జెట్‌లో మ‌ళ్లీ రాజ‌ధాని ఊసు క‌నిపించ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ ఏడాది ప్ర‌స్తుత వార్షిక బ‌డ్జెట్ 2022-23లోనూ రాజ‌ధాని అమరావ‌తి ఊసు మ‌న‌కు క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో విశాఖ రైల్వేజోన్‌కు కూడానిధులు కేటాయించలేదు. కీల‌క‌మైన న‌ర‌సాపురం.. హైద‌రాబాద్‌.. డుబుల్‌ లైన్ ప‌నులు.. విశాఖ మెట్రో.. విజ‌య‌వాడ మెట్రో వంటివి కూడా గ‌త బ‌డ్జెట్‌లో ఇవ్వ‌లేదు.

దీంతో వ‌చ్చే 2023-24 బ‌డ్జెట్‌లో అయినా.. అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి ప్ర‌తిపాద‌న‌లు అందిన‌ట్టు ఎక్క‌డా స‌మాచారం రావ‌డం లేదు. అంతేకాదు.. భోగాపురం విమానాశ్ర‌యం ప‌నులు మాత్రం వ‌చ్చే బ‌డ్జెట్‌లో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వెనుక‌బ‌డిన ప్రాంతాలు.. పోల‌వ‌రం ప్ర‌త్యేక నిధులు వంటివి కూడా బ‌డ్జెట్‌లో క‌నిపించే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు.

అంటే.. మొత్తంగా చూస్తే.. ఏపీ ఏం చెప్పిందో ఇత‌మిత్థంగా తెలియ‌క‌పోయినా..కీల‌క‌మైన రాజ‌ధాని, పోల‌వ‌రం, వెనుక బ‌డిన జిల్లాల‌కు నిధులు వంటి విష‌యంలో ఈ సారికూడా కేంద్రం బ‌డ్జెట్‌లో ఏపీ ప్రస్తావ‌న‌ను తెచ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. అదేవిధంగా కేటాయింపుల్లోనూ ఈ సారి భారీ కోత పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి గ‌త ఏడాది బ‌డ్జెట్ కంటే కూడా వ‌చ్చే బ‌డ్జెట్‌లో కేంద్రం ఏపీకి చేసేది ఏమీ క‌నిపించ‌డం లేద‌ని డిల్లీ వ‌ర్గాలు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.