వైసీపీ ఫైర్‌ బ్రాండ్ యువ ఎంపీకి టికెట్ క‌ట్‌..

వైసీపీ యువ నాయ‌కుడు, ఒక సినిమాలో హీరోగా కూడా చేసిన యువ న‌టుడు.. మార్గాని భ‌ర‌త్‌. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మండ్రి (రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) పార్ల‌మెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. పార్టీలోనూ మంచి గుర్తింపు ఉంది. అయితే.. వైసీపీలో ఆయ‌న‌కు సుదీర్ఘ అనుబంధం అయితే ఏమీలేదు. గత ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న తండ్రి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. ఆయ‌న టీడీపీలోకి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కుటికెట్ ఇవ్వ‌మ‌ని చంద్ర‌బాబును అడిగారు. అయితే.. ఆదిరెడ్డి అప్పారావు(కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు వియ్యంకుడు) వ‌ర్గం చేసిన రాజ‌కీయంతో ఆయ‌న‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు.

దీంతో వైసీపీ వైపు చూశారు. ఈ క్ర‌మంలోనే పాద‌యాత్ర‌ను ముగించుకున్న జ‌గ‌న్‌ను హైద‌రాబాద్‌లో క‌లిశారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన కుటుంబం కావ‌డం, ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డంతో జ‌గ‌న్ మొగ్గు చూపారు. అయితే, స్థానికంగా వ‌చ్చిన నివేదిక ఆధారంగా.. మార్గాని భ‌ర‌త్‌కు టికెట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనికి ఆయన తండ్రి కూడా ఓకే చెప్పారు. ఇలా.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న భ‌ర‌త్.. సినీ రంగాన్ని వ‌దులుకుని రావ‌డాన్ని కూడా ప్ర‌చారం చేసుకుని, జ‌గ‌న్ హ‌వాతో విజ‌యం ద‌క్కించుకున్నారు. అప్ప‌ట్లో వైసీపీ నేత‌లు జ‌క్కంపూడి రాజా వంటివారు స‌హ‌క‌రించారు.

అయితే..ప‌రిస్థితులు ఇప్పుడు అలా లేవు. రాజ‌మండ్రి పార్ల‌మెంటునియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐదుగురు ఎమ్మెల్యేల‌తో మార్గాని భ‌ర‌త్‌కు వివాదాలు, విభేదాలు కొన‌సాగుతున్నాయి. జ‌క్కంపూడి ఏకంగా మీడియా మీటింగ్ పెట్టి విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో ఎంపీ కూడా త‌గ్గేదేలే అంటూ.. ఎదురు దాడి చేశారు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య వివాదాల‌ను అధిష్టానం కుదిర్చినా.. ఇప్ప‌టికీ.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌తంగా ఎంపీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్న‌వారు ఉన్నారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన పార్టీ అధిష్టానం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎంపీ సీటు ఇస్తే.. వ‌దులు కోవ‌డం త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన అధిష్టానం.. ఆయ‌న‌కు ఎంపీ టికెట్ ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అలాగ‌ని.. భ‌ర‌త్‌ను ప‌క్క‌న అయితే పెట్ట‌రు. ఎందుకంటే.. సీఎం జ‌గ‌న్‌తో భ‌ర‌త్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గాన్ని కేటాయించ‌నున్నార‌నే చ‌ర్చ‌సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.