ప‌వ‌న్‌పై ఏపీ పోలీసుల కేసు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఏపీ పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేష‌న్‌లో పోలీసులు శుక్ర‌వారం ఈ కేసు నమొదు చేసినట్టు తెలుస్తోంది. పవన్‍పై IPC 336, రెడ్‍విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేయ‌డంగ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అయితే, ఆయ‌న ప్ర‌స్తుతం విశాఖ‌లోనే ఉన్నారు. దీంతో విశాఖ‌కు వెళ్లి నోటీసులు ఇవ్వాలా..? లేక తాడేప‌ల్లికి పిలిపించాలా? అనే విష‌యంపై ఏపీ పోలీసులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

ఇంత‌కీ ప‌వ‌న్‌పై ఏం కేసు పెట్టారంటే.. ఇటీవ‌ల గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామంలో ర‌హ‌దారి అభివృద్ధి పేరుతో ప్ర‌భుత్వం కొన్ని ఇళ్ల అక్ర‌మ ఆక్ర‌మ‌ణ‌ల విష‌యంలో కూల్చివేత‌ల‌కు శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌న‌సేనాని ఫైర్ అయ్యారు. అస‌లు ఇవి ఆక్ర‌మ‌ణ‌లు కావ‌ని.. త‌న పార్టీ జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు ఇక్క‌డి రైతులు భూములు ఇచ్చార‌నే దుగ్థ‌తోనే ప్ర‌భుత్వం ఇలా చేసింద‌ని ఆరోపించారు.

ఈక్ర‌మంలోనే ఇక్క‌డ‌కు వ‌చ్చి ఇప్ప‌టి ప్ర‌జ‌ల‌కు ఓదార్పునిచ్చే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. పోలీసులు ఇక్క‌డ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తించ‌ని నేప‌థ్యంలో పాద‌యాత్ర‌గా వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. అయితే, ఆయ‌న ఇక్క‌డ ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించి..తిరిగి వెళ్తున్న క్ర‌మంలో ఓపెన్ టాప్ కారుపై భాగంలో కూర్చుని గ‌న్న‌వ‌రం వెళ్లారు. పవన్ కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్‍ చేశార‌నే వాద‌న వినిపించింది.

ఈ నేప‌థ్యంలో ఆయా అంశాల‌పైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. హైవేపై పవన్ కాన్వాయ్‍ని పలు వాహనాలు అనుసరించడంపైనా కేసు పెట్టారు. తెనాలి మారిస్‍పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్‌తోపాటు ఆయ‌న కారు డ్రైవర్‍పై కూడా కేసు నమోదు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఈ కేసులు నిలిచే ప‌రిస్థితి లేద‌ని.. ఇవి ట్రాఫిక్ రూల్స్ ప్ర‌కారం న‌మోదు చేసిన‌వే కాబ‌ట్టి 41ఏతో సంబంధం లేద‌ని పోలీసులే చెబుతున్నారు. కానీ, నోటీసులు ఎందుకు ఇస్తున్నారో మాత్రం చెప్ప‌డం లేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.