మ‌రింత ముదిరిన ఫామ్ హౌజ్ ఇష్యూ.. హైకోర్టుకు బీజేపీ!

తెలంగాణ‌లో వెలుగు చూసిన ఫామ్ హౌజ్ ఇష్యూ కీల‌క ట‌ర్న్ తీసుకుంది. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ విష‌యంపై అధికార టీఆర్ఎస్‌, బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఘటనపై సిట్‌ను నియమించాలని పిటిషన్‌లో కోరింది.

పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ టీఆర్ఎస్‌కు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలను కొందరు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు.. ఈ కేసు మూలాల‌పైనా విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మొయినాబాద్‌ సమీపంలోని ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు.

వారిని పోలీసు అధికారులు రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారిస్తున్నారు. బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్లు సమాచారం. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రలోభాలకు గురిచేయడం, బేరసారాలకు పాల్పడటంపై మొయినాబాద్‌ పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

అయితే.. ఈ వ్య‌వ‌హారంపై.. బీజేపీ తీవ్రంగా రియాక్ట్ అయింది. మునుగోడు ఉప ఎన్నిక‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని.. భావిస్తున్న క‌మ‌లం పార్టీ నాయ‌కులు.. త‌మ చేతుల‌కు మ‌ట్టి అంటుకోకుండా.. జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. తాజా పిటిష‌న్‌పై.. హైకోర్టు శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశం ఉంది.