‘జోడో’తో జ‌య‌మెంత‌? కాంగ్రెస్‌లో అంత‌ర్మ‌థ‌నం

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రారంభమైంది. తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌ వరకు కొనసాగే ఈ పాదయాత్రకు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నేతృత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకునేలా, దేశంలో బీజేపీయేతర శక్తి బలంగా ఉందని చాటే ఉద్దేశంతో పకడ్బందీ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ పాద‌యాత్ర‌ను కాంగ్రెస్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డమే ల‌క్ష్యంగా పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం దీనికి ప్ర‌ణాళిక చేసిన విష‌యం తెలిసిందే. రాహుల్‌ గాంధీ పాదయాత్రకు నిత్యం 3 షిఫ్టుల్లో పోలీసు బలగాలు భద్రత కల్పించనున్నాయి. తమిళనాడులో 2,500 మంది పోలీసుల్ని ఈ విధుల్లో నియమించారు. యాత్ర తొలి 4 రోజులు తమిళనాడులో కొనసాగనుంది. ఈ నెల 11వ తేదీన కేరళలోకి ప్రవేశిస్తుంది.

యాత్రలో రాహుల్‌గాంధీ వెంట వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 117 మంది కాంగ్రెస్‌ నేతలు నడక సాగించనున్నారు. వీరిని భారత్‌ యాత్రీస్‌ అని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటుండగా.. తెలంగాణ నుంచి ఆరుగురు వచ్చారు. కేతూరి వెంకటేష్‌, సంతోష్‌.కె, వెంకటరెడ్డి, కత్తి కార్తీకగౌడ్‌, బెల్లయ్యనాయక్‌ తెలావ్‌, అనులేఖ బూస వీరిలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 32 మంది మహిళలకు అవకాశం కల్పించారు.

మధ్యాహ్నం తర్వాత యాత్రలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. రాహుల్‌ వెళ్లని రాష్ట్రాల్లో ఈ యాత్రకు అనుబంధంగా ‘అతిథి యాత్రీస్‌’ పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే.. అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ చ‌రిత్రలో ఇలా.. పాద‌యాత్ర చేయ‌డం.. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం.. వారి క‌ష్ట‌సుఖాలు పంచుకోవ‌డం.. అనేది.. ఇదే మొద‌టిసారి అని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అంటే.. దీనిని సానుబూతి కోణంలో చూస్తే.. ప్ర‌జ‌ల‌కు చేరువయ్యేందుకు కాంగ్రెస్‌కు ఇది మంచి అవ‌కాశ‌మ‌నేచెప్పాలి.

కానీ, అదేస‌మ‌యంలో మోడీ హ‌వాతో కాంగ్రెస్ నేల‌కు దిగి వ‌చ్చేసింద‌నే కామెంట్ల‌ను సైతం ప‌ట్టించుకోక త‌ప్ప‌దు. ఎందుకంటే.. ప‌దేళ్ల‌పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. అప్ప‌టి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని లెక్క‌లోకి తీసుకుంటే.. చేసింది ఏమీ లేద‌నే వాద‌న ఉంది. ప్ర‌స్తుతం మోడీ అవ‌లంబిస్తున్న విధానాలు.. అప్ప‌ట్లో పురుడు పోసుకున్న‌వే. జీఎస్టీ, నిత్యం గ్యాస్‌, ఇంధ‌న ధ‌ర‌ల‌ను సమీక్షించ‌డం.. ఎన్నిక‌ల స‌మ‌యంలో నిలుపుద‌ల చేయ‌డం.. ఇలా.. అనేక ప‌రిణామాలు అప్ప‌టివే. ఇక‌, ఇప్పుడు వాటిపైనేకాంగ్రెస్ పోరాటం చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. కాంగ్రెస్‌కు త‌క్ష‌ణం కావాల్సింది.. పార్టీలో నేత‌ల‌ను బ‌లోపేతం చేయ‌డం. అదేస‌మ‌యంలో అసంతృప్తుల‌ను త‌గ్గించి.. నాయ‌కుల‌ను కాపాడుకోవ‌డం.. ఈ మూడు అంశాల‌కు.. ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రంఉంది. లేక‌పోతే.. మ‌రింత మంది కాంగ్రెస్‌ను వీడ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో విజిటింగ్ రాజ‌కీయాలు చేస్తార‌నే అప‌వాదును రాహుల్ సైతం.. తుడిచిపెట్టేలా వ్య‌వ‌హ‌రించాలి. అప్పుడే.. కాంగ్రెస్‌కు జోడో యాత్ర స‌ఫ‌లం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.