కేసీయార్ ను అవమానించిన మోడీ సర్కార్

నరేంద్రమోడీ ప్రభుత్వం కేసీయార్ తో పాటు మరికొందరు ముఖ్యమంత్రులను ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించింది. పదవీ విరమణ చేయబోతున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నరేంద్ర మోడీ వీడ్కోలు విందిచ్చారు. ఈ విందుకు తనకు ఇష్టమైన ముఖ్యమంత్రులను మాత్రమే పిలిచి ఇష్టంలేని ముఖ్యమంత్రులను వదిలేశారు. నిజానికి రాష్ట్రపతి గౌరవార్థం విందు ఇస్తున్నపుడు ఎవరిని పిలవాలనే విషయంలో స్పష్టమైన ప్రోటోకాల్ ఉంటుంది.

ప్రోటోకాల్ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ మోడీ సర్కార్ దాన్ని తుంగలో తొక్కటమే విచిత్రంగా ఉంది. తనకిష్టం ఉన్నా లేకపోయినా మోడీ కొందరిని పిలిచి తీరాల్సిందే. ఎందుకంటే మోడీ ఇచ్చిన విందు వ్యక్తిగతం కాదు. రామ్ నాథ్ వచ్చిందీ వ్యక్తిగత హోదాలో కాదు. ప్రధానమంత్రి హోదాలో మోడీ ఇచ్చిన విందుకు రాష్ట్రపతి హోదాలో కోవిండ్ హాజరయ్యారు. కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా అందరు ముఖ్యమంత్రులను పిలిచి తీరాల్సిందే.

విందుకు 21 మంది ముఖ్యమంత్రులను పిలిచిన ప్రధానమంత్రి కార్యాలయం కేసీయార్ తో పాటు కేరళ, ఛత్తీస్ ఘడ్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మిజోరం, ఝార్ఖండ్ సీఎంలను పిలవలేదు. విచిత్రమేమిటంటే అందరినీ వ్యక్తిగతంగా పిలిచేంత సమయంలేదు కాబట్టి ఢిల్లీలోని వివిధ రాష్ట్ర భవన్ల రెసిడెంట్ కమీషనర్లకు ఇన్విటేషన్ కార్డులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నది ప్రధాని కార్యాలయం. అందరినీ ప్రధానమంత్రే స్వయంగా పిలవాల్సిన అవసరం లేదు. పీఎంవోలోని కీలక వ్యక్తికి అప్పగిస్తే సదరు ఉన్నతాధికారే ముఖ్యమంత్రులకు ఫోన్లో ఆహ్వానిస్తారు. కానీ ఆ పని కూడా పీఎంవో చేయలేదు.

యూపీఏ కూటమిలోని సీఎంలకు, యశ్వంత్ కు మద్దతిచ్చిన సీఎంలను మోడీ పిలవలేదు. మళ్ళీ తమిళనాడు సీఎం స్టాలిన్ను మాత్రం పిలిచారు. చివరినిముషంలో విందు ఇవ్వాలని నిర్ణయమైంది కాబట్టి సీఎంలను పిలవలేకపోతున్నట్లు చెప్పటం కూడా అబద్ధం చెప్పి కొందరు సీఎంలను ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించినట్లు అర్ధమైపోతోంది. పిలిచిన వారిలో జగన్, నవీన్ పట్నాయక్ హాజరుకాకపోవటం గమనార్హం.