తమ్ముడి పై ఫిర్యాదుచేసిన ఎంపీ

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినాని కుటుంబంలో విబేధాలు ముదిరి పాకానపడ్డాయి. తమ్ముడిపైనే ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు బుక్ చేయటం ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది. ఎంపీ చేసిన ఫిర్యాదు దాదాపు నెల క్రితం చేస్తే ఇపుడు బయటపడింది. ఇంతకీ ఆ ఫిర్యాదు ఏమిటంటే ఎంపీగా తన పేరున్న స్టిక్కర్ ను ఒక అజ్ఞాత వ్యక్తి కారుకు అతికించుకుని వాడుకుంటున్నారట.

కారు ఎక్కడైనా వివాదంలో ఇరుక్కుంటే తనపేరే ముందు బయటకు వస్తుంది కాబట్టి పోలీసులు వెంటనే తన ఫిర్యాదుపై యాక్షన్ తీసుకోవాలని నాని డిమాండ్ చేశారు. అయితే ఎంపీ చెప్పిన సదరు కారు గడచిన నెలగా హైదరాబాద్ లోని మాదాపూర్ తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎంపీ చెప్పినట్లుగా ఆ కారును గుర్తించి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. తీరా చూస్తే ఆ కారు ఎంపీ తమ్ముడు కేశినేని చిన్నిదిగా తేలింది. ఆ కారు రిజిస్ట్రేషన్ ప్రకారం చిన్ని భార్య ఝాన్సీ పేరు మీద రిజస్టర్ అయ్యుందట.

అంటే కారుకి తన స్టిక్కర్ ను అతికించుకుని తమ్ముడు తిరుగుతున్న సంగతి ఎంపీకి తెలిసి కావాలనే ఫిర్యాదు చేసినట్లు అర్దమవుతోంది. ఎందుకంటే చాలాకాలంగా ఎంపీకి తమ్ముడు చిన్నీకి పడటంలేదు. టీడీపీకి దూరంగా ఎంపీ వ్యవహరిస్తుండటంతో చంద్రబాబునాయుడు చిన్నీని దగ్గరకు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా చిన్నీయే పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. హోలు మొత్తంమీద ఎంపీదే పూర్తి తప్పంతా కనబడుతోంది.

పార్టీ ఎంపీగా ఉండదలచుకుంటే పార్టీతోనే ఉండాలి. అలాకాకుండా పార్టీతో అవసరం లేదనుకుంటే పార్టీ ఎవరిని ఎంపీగా పోటీచేయించినా నానికి పట్టించుకోకూడదు. కానీ ఏకకాలంలో నాని పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చివరినిముషంలో నాని టీడీపీ తరపున పోటీకి నిరాకరిస్తే అప్పుడు పార్టీ ఏమిచేయాలి ? అందుకనే ప్రత్యామ్నాయాన్ని ఇప్పటినుండే చూసుకుంటోంది. దీన్ని ఎంపీ సహించలేకపోతున్నారు. దాంతోనే ఇపుడీ పరిణామాలు చోటుచేసుకున్నాయి.