బాబు హుషారు- 100 నియోజకవర్గాల్లో రోడ్డు షోలు

వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు భారీ ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు నుంచి ఏడాదిలోపు 100 నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఏడాదిపాటు జిల్లాల్లో పర్యటనలు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. జిల్లాల పర్యటన ఈరోజు అంటే బుధవారం నుండే ప్రారంభమవుతున్నాయి. తన పర్యటనను అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంతో చంద్రబాబు మొదలు పెట్టబోతున్నారు.

‘ఎన్టీయార్ స్పూర్తి-చంద్రన్న భరోసా’ పేరుతో ఏడాది పాటు జిల్లాల పర్యటనలను ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, విధ్వంస పాలనను ఎండగడుతూ, ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించటమే ధ్యేయంగా చంద్రబాబు పర్యటనలు సాగబోతున్నాయి. పార్టీ క్యాడర్, ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రతి జిల్లాలోని మినీ మహానాడును మూడురోజులు జరపాలని చంద్రబాబు ఆదేశించారు.

మూడు రోజుల మహానాడులో జిల్లాలోని నేతలందరూ పార్టిసిపేట్ చేయాలని చంద్రబాబు చెప్పారు. రెండు రోజులు పార్టీ పరిస్ధితి, ప్రభుత్వ వైఫల్యాలను చర్చిస్తారు. మూడోరోజు జిల్లాలోని పబ్లిక్ ను ఇన్వాల్వ్ చేస్తు బహిరంగ సభలు నిర్వహించాలని చెప్సారు. గురువారం జిల్లాలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. మూడోరోజు శుక్రవారం బాదుడే బాదుడు, ప్రజా సమస్యలే టార్గెట్ గా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో రోడ్డుషో నిర్వహించబోతున్నారు.

ఇదే పద్దతిలో ప్రతినెలా రెండు జిల్లాల్లో పర్యటించేలా చంద్రబాబు ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఏడాదికి 100 నియోజకవర్గాల్లో రోడ్డుషోల్లో పాల్గొనబోతున్నారు. గతంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తర్వాత ఒంగోలులో రెండురోజుల మహానాడును నిర్వహించారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి, మహానాడు బహిరంగ సభకు జనాలు బాగా వచ్చారు కాబట్టి ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని చంద్రబాబు అనుకుంటున్నారు.

అయితే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందనేందుకు ఇది నూరు శాతం కచ్చితమైన ప్రామాణికమేమీ కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఏదేమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావటానికి ప్రతిపక్షాలు ప్రయత్నించటం స్వాగతించాల్సిందే. మరి చివరకు వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.