రాహుల్ క్రేజ్ పెంచుతున్న ఉస్మానియా

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది. మే 6వ తేదీన వరంగల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. రైతుల సమస్యలు, పరిష్కారాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల పరామర్శే  టార్గెట్ గా బహిరంగ సభ జరగబోతోంది. బహిరంగ సభ నిర్వహణకు ముందుగానే అనుమతి తీసుకున్నారు కాబట్టి దీనిపై ఎలాంటి సమస్య లేదు.

రాహుల్ రెండు రోజుల పర్యటనలో విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం విషయంలోనే టెన్షన్ పెరిగిపోతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో రాహుల్ ముఖాముఖి కార్యక్రమం అనుమతిని యూనివర్సిటి తిరస్కరించింది. దాంతో ఈ విషయం కాస్త వివాదాస్పదమైంది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగంణంలోకి రాహుల్ అనుమతిని నిరాకరించిన విషయమై టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

వరంగల్ లో బహిరంగ సభ అయిపోయిన తర్వాత రాహుల్ ఏమి చేయబోతున్నారన్నదే ఇపుడు కీలకమైంది. ఎలాగైనా విద్యార్థి, నిరుద్యోగ సంఘాలతో రాహుల్ ముఖాముఖి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు పంతంగా ఉన్నారు. ఆ భేటీ ఎక్కడ జరగాలన్నదే ఇంకా తేలలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు భేటీ విషయాన్ని వ్యూహాత్మకంగానే గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రచారం అవుతోంది. రాహుల్ పర్యటనలో విద్యార్ధులు, నిరుద్యోగులు భేటీ కాకూడదన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు అనుమానంగా ఉంది.

లేకపోతే విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్ భేటీ అయితే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో అర్ధం కావటం లేదు. ఈ భేటీని ప్రభుత్వం అడ్డుకునే కొద్దీ జనాల్లో రాహుల్ పర్యటనపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది. ఒకవేళ యూనివర్సిటీ అధికారులు రాహుల్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చేసుంటే ఇపుడున్నంత ఆసక్తి అప్పుడుండేది కాదు. కార్యక్రమంలో రాహుల్ పాల్గొనేవారు, నిరుద్యోగులు, విద్యార్ధులు ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసేవారు, కార్యక్రమం అయిపోయేది. కానీ అలాకాకుండా ప్రోగ్రామ్ ను అడ్డుకోవటంతోనే సమస్యంతా వచ్చింది. ప్రభుత్వం అనాలోచితంగా రాహుల్ సభకు లేనిపోని క్రేజ్ తెచ్చుపెడుతోందనే అనామానలు పెరిగిపోతున్నాయి. చివరకు రాహుల్ పర్యటనలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.