రాహుల్ మాట‌లతో.. జ‌గ్గారెడ్డి మారిపోయారే!

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలతో సాగుతున్నారు.. ఆయ‌న్ని ప‌ద‌వి నుంచి త‌ప్పించి ఇత‌రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాలి.. లేని ప‌క్షంలో పార్టీకి రాజీనామా చేస్తా.. ఇవీ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయ‌కుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు! గ‌తం గ‌తః ఆ వ్యాఖ్య‌లు మ‌ర్చిపోవాలి.. ఇప్పుడు పూర్తిగా మారిపోయా.. పార్టీ కోసం క‌లిసి ప‌ని చేస్తా.. ఎంత‌గా మారిపోయానో మీరే చూస్తారు.. ఇక‌పై బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేయ‌ను.. ఇవీ తాజాగా జ‌గ్గారెడ్డి చెబుతున్న మాట‌లు. కాంగ్రెస్ అగ్ర‌ నాయ‌కుడు రాహుల్ గాంధీతో భేటీ త‌ర్వాత జ‌గ్గారెడ్డి పూర్తిగా మారిపోయాన‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ర‌చ్చ రచ్చ చేసి..
టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ ఎంపిక‌ను జ‌గ్గారెడ్డి వ్య‌తిరేకిస్తున్న‌ట్లు క‌నిపిస్తూ వ‌చ్చారు. ముఖ్యంగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు త‌న‌కు క‌నీసం స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం ఆయ‌న ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. మ‌రోవైపు జ‌గ్గారెడ్డి టీఆర్ఎస్ కోవ‌ర్టు అని రేవంత్ రెడ్డి వ‌ర్గం ప్ర‌చారం చేయ‌డం ఆయ‌న‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. దీంతో రేవంత్‌పై బహిరంగంగానే విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఆయ‌న్ని పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేశారు. అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించి దాన్ని వాయిదా వేశారు. రేవంత్‌కు వ్య‌తిరేకంగా సీనియ‌ర్ల‌తో క‌లిసి స‌మావేశాలు నిర్వ‌హించారు. కానీ జ‌గ్గారెడ్డి తీరుపై అధిష్టానం మండిప‌డింది. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వెనుకాడ‌లేదు. ఆయ‌న్ని పార్టీ అద‌న‌పు బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి షాకిచ్చింది.

ఇప్పుడు సమావేశంతో..
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల‌తో రాహుల్ గాంధీ స‌మావేశమ‌య్యారు. రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పార్టీ ప‌రిస్థితులు తెలుసుకున్నారు. సీనియ‌ర్లు రేవంత్‌పై ఫిర్యాదు చేయ‌గా.. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా సాగాలని రాహుల్ గ‌ట్టిగానే చెప్పిన‌ట్లు తెలిసింది. రేవంత్ నాయ‌క‌త్వంలో పార్టీ పుంజుకుంటుంద‌ని విభేదాలు ప‌క్క‌న‌పెట్టి పార్టీ కోసం ప‌ని చేయాల‌ని ఆయ‌న సూచించారు. దీంతో రేవంత్‌పై అసంతృప్తితో ఉన్న నాయ‌కులు త‌గ్గ‌క త‌ప్ప‌లేదు.

అధిష్ఠానం అండ రేవంత్‌కు ఉండ‌డంతో ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో క‌లిసి ప‌ని చేస్తామ‌ని చెప్పాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో జ‌గ్గారెడ్డి కూడా వెన‌క్కి త‌గ్గార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ ప‌ద‌వుల నుంచి ఆయ‌న్ని త‌ప్పించిన నేప‌థ్యంలో.. ఇంకా ఏమైనా విమ‌ర్శ‌లు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని భావించిన‌ట్లు తెలుస్తోంది. మిగ‌తా సీనియ‌ర్ నేత‌లు కూడా ఇలాగే ఆలోచించార‌ని స‌మాచారం. రాహుల్‌తో భేటీ త‌ర్వాత జ‌గ్గారెడ్డి ప్ర‌క‌ట‌న అందుకు నిద‌ర్శ‌నం. త‌మ‌దంతా ఒకే కుటుంబ‌మ‌ని రాహుల్ అన్నార‌ని, గ‌తంలో తాను మాట్లాడిన మాట‌ల‌న్నీ మ‌ర్చిపోయాన‌ని జ‌గ్గారెడ్డి తెలిపారు. తాను పూర్తిగా మారిపోయాన‌ని వెల్ల‌డించారు.