రేవంత్ ప్ర‌త్య‌ర్థుల‌కు అదిరిపోయే షాక్

అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరుతో అసంతృప్తులు, అంతర్గత క‌లహాల‌తో తెలంగాణ‌ కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయం క్రేజీగా మారిన సంగ‌తి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డిపై పార్టీ సీనియ‌ర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌‌రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్‌‌ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఉత్తమ్‌‌, సీఎల్పీ నేత భట్టి కూడా రేవంత్‌‌ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. లాయలిస్టుల ఫోరం పేరుతో పార్టీ సీనియర్లు పలుమార్లు భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌‌‌‌ రెడ్డి ఇంట్లో మీటింగ్‌‌లు కూడా జరిగాయి. అయితే, దీనికి చెక్ పెట్టేలా రాహుల్‌‌ గాంధీతో రాష్ట్ర నేతలు ఢిల్లీలో సోమవారం భేటీ కానున్నారు. ఈ స‌మావేశానికి ముందే సీనియ‌ర్ల‌కు షాక్ త‌గిలింద‌ని అంటున్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. తెలంగాణలో పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు రాహుల్ గాంధీ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌‌కు పీసీసీ నేతలతో పాటు పది మంది మాజీ మంత్రులు, సీనియర్లకు పిలుపు అందినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మార్చి 30న జరిగిన మీటింగ్‌‌లో పార్టీ సభ్యత్వాలపై మాత్రమే చర్చ జరగ్గా.. ఈసారి పార్టీలో అసంతృప్తులు, భవిష్యత్ కార్యాచరణ, కేసీఆర్‌‌‌‌ సర్కార్‌‌‌‌ తీరుపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ బలాబలాలు, లీడర్ల పనితీరు, జనంలో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు స‌వివ‌రంగా భేటీ అవ‌నున్న‌ట్లు చెప్తున్నారు.

అయితే, పీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా ఉన్న సీనియ‌ర్ల‌కు ప‌రోక్షంగా రాహుల్ గాంధీ కౌంట‌ర్ ఇచ్చార‌ని అంటున్నారు. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న శాసన సభ ఎన్నికల్లో కనీసం 150 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. పనితీరు ఆధారంగానే ఈ సారి టికెట్లు కేటాయిస్తామని, పనిచేయకుండా.. లాయల్టీ, సీనియరిటీ అంటే కుదరదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఒక‌వేళ ఇదే ఫార్ములాను తెలంగాణ‌లో కూడా అమ‌లు చేస్తే, పార్టీలోని సీనియ‌ర్ల‌కు చెక్ పెట్టిన‌ట్లేన‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.