తెలంగాణ: విద్యుత్ ఛార్జీలతో షాక్

తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. పేద, మధ్య, ధనిక వర్గాలనే తేడా లేకుండా ప్రభుత్వం అందరినీ సమానంగా భావించి ఛార్జీల పెంపుతో బాదేసింది. యూనిట్ కు సగటున 10 పైసల నుండి 50 పైసలవరకు వీరబాదుడు బాదింది. నివాసలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలన్న తేడా లేకుండా అన్నీ క్యాటగిరిల వాడకానికి చార్జీలను పెంచేసింది. దీనివల్ల బిల్లులు భారీగా రాబోతున్నట్లు జనాల్లో టెన్షన్ మొదలైపోయింది.

గతంలో ఎప్పుడూ లేనంతగా ఛార్జీల పెంపు వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 5596 కోట్ల అదనపు భారాన్ని జనాలపై ప్రభుత్వం మోపింది. ప్రస్తుత విద్యుత్ ఛార్జీలను 18 శాతం పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి కోరితే విద్యుత్ నియంత్రణ మండలి జనాలపై కాస్త జాలి చూపించి 14 శాతం పెంపుకు మాత్రమే అనుమతించింది. కేసీయార్ ప్రభుత్వం వచ్చిన ఎనిమిదేళ్ళల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటం ఇది మూడోసారి.

దేశంలోనే తెలంగాణా అత్యంత ధనిక రాష్ట్రమని మాటిమాటికి డప్పు కొట్టుకునే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచుతున్నదో అర్థం కావటం లేదు. ఒకవైపు అత్యంత చవకైన జల విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రభుత్వమే చెప్పుకుంటోంది. చవకైన జల విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంటున్నపుడు విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందో అర్థం కావటం లేదు. మరి ఉత్పత్తవుతున్న జలవిద్యుత్ ఎటుపోతోంది ?

శ్రీశైలం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల్లాంటి వాటి నుండి భారీగానే జల విద్యుత్ జరుగుతున్నట్లు గతంలో ప్రభుత్వమే చెప్పింది. వ్యవసాయ వాడకానికి మీటర్లు పెట్టేది లేదని ఇప్పటికే కేసీయార్ తేల్చిచెప్పారు. మరి వ్యవసాయానికి ఎంత విద్యుత్ వాడుతున్నది తేలకపోతే విద్యుత్ ఉత్పత్తి, వాడకంలో లెక్కలు సక్రమంగా ఎలా తేలుతాయి. ఏంటో పాలకులు చెప్పేదొకటి, చేసేదొకటిగా అయిపోతోంది. విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల సామర్థ్యం పెంచుకోవటం, సరఫరాలో లీకేజీలు లేకుండా చూసుకుంటు వినియోగాన్ని క్రమపద్దతిలో పెట్టకపోతే  ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసినా ఉపయోగముండదు. వినియోగాదారులను ఛార్జీల పెంపుతో మోత మొగిస్తుండాల్సిందే.