అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. డిసెంబర్ 5 రిలీజ్ డేట్ అయినప్పటికీ ముందు రోజు రాత్రి స్పెషల్ ప్రీమియర్లు వేస్తుండటంతో అభిమానులు ఎగ్జైటవుతున్నారు. ఏపీ జిఓ టైంకి రావడంతో బుకింగ్స్ వేగంగా మొదలైపోగా తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఏ నిమిషమైనా దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది. మాములుగా సీనియర్ స్టార్ హీరోలకు ముందు రోజు ప్రీమియర్ వేయడమనేది గత కొన్నేళ్లుగా జరగలేదు. ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం ఆ రిస్కు తీసుకుంటున్నారు.

కానీ బాలయ్య దాన్ని బ్రేక్ చేస్తూ ముందస్తు ప్రదర్శనలకు సిద్ధమవ్వడం చూస్తే ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఓజి, కాంతార తర్వాత అడపాదడపా హిట్లు వస్తున్నప్పటికీ థియేటర్లను వారాల తరబడి ఫుల్ చేసే మాస్ సినిమా టాలీవుడ్ కు రాలేదు. అందుకే అఖండ 2 మీద బయ్యర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. అర్ధరాత్రి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు వసూళ్ల ఊచకోత ఖాయం. కాకపోతే ప్రీమియర్ ధర ఆరు వందలు పెట్టడం కొన్ని చోట్ల ప్రభావం చూపిస్తున్నట్టు ట్రేడ్ టాక్. నగరాలు, పట్టణాల్లో ఓకే కానీ చిన్న సెంటర్లలో ఇబ్బందే. అందుకే కొన్ని చోట్ల ప్రభుత్వం అనుమతించిన గరిష్ట ధర కంటే తక్కువే పెట్టారట.

ఇక బాలయ్య ఆడబోయే తాండవం కోసం ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తోంది. థియేటర్ల దగ్గర సందడి వాతావరణం రేపటి నుంచి నాన్ స్టాప్ గా ఉండాలని కోరుకుంటోంది. హిందీలో ప్రమోషన్లు విస్తృతంగా చేసినప్పటికీ ఇంకా అక్కడ ఊపందుకోవాలి. రణ్వీర్ సింగ్ దురంధర్ అదే రోజు ఉండటం కొంచెం సమస్య అయ్యింది. అయినా టాక్ వస్తే చాలు అఖండ 2 పికప్ ని సులభంగా ఆశించవచ్చు. టీమ్ అయితే అదే ధీమాలో ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే అయిదింతలు ఎక్కువ యాక్షన్, ఎమోషన్, డివోషన్ ఇందులో ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అదే నిజమైతే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.