కొంప ముంచిన ఇండిగో స్ట్రాటజీ

హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు గొడవలు జరుగుతున్నాయి. ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గత 48 గంటల్లోనే 300కు పైగా సర్వీసులు రద్దు అయ్యాయంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో జనం ఫైర్ అవుతున్నారు. అసలు సడెన్‌గా ఇండిగోకి ఏమైంది? ఎందుకింత గందరగోళం?

దీని వెనుక ఉన్న అసలు కారణం డీజీసీఏ (DGCA) తీసుకొచ్చిన కొత్త సేఫ్టీ రూల్స్. ప్రయాణికుల భద్రత కోసం పైలట్లకు, క్రూ మెంబర్లకు సరైన విశ్రాంతి ఉండాలని నిబంధనలు మార్చారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్‌లు, డ్యూటీ టైమింగ్స్‌పై ఆంక్షలు విధించారు. ఇంతకుముందు రోస్టర్‌లో 6 నైట్ ల్యాండింగ్స్ ఉంటే, ఇప్పుడు దాన్ని రెండింటికి తగ్గించారు. అలాగే రాత్రి సమయాన్ని మరో గంట పెంచారు. ఈ కొత్త రోస్టర్ సిస్టమ్ వల్ల ఉన్న సిబ్బంది సరిపోక విమానాలు ఆగిపోతున్నాయి.

అందరికీ రూల్స్ ఒక్కటే కదా, మరి ఇండిగోనే ఎందుకు టార్గెట్ అయ్యింది? అనే డౌట్ రావచ్చు. దీనికి కారణం ఇండిగో ఆపరేషన్స్ సైజ్. రోజుకు ఏకంగా 2,200 విమానాలు నడిపే అతిపెద్ద సంస్థ ఇది. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది డబుల్. పైగా లో కాస్ట్ ఎయిర్‌లైన్ కాబట్టి ఇండిగో ఎక్కువగా నైట్ ఆపరేషన్స్ మీదే ఆధారపడుతుంది. తక్కువ టైమ్ గ్యాప్‌తో ఎక్కువ ఫ్లైట్లు తిప్పే వారి ప్లాన్‌కి, డీజీసీఏ కొత్త రూల్స్ బ్రేకులు వేశాయి. అందుకే ఆ ఇంపాక్ట్ గట్టిగా పడింది.

అయితే, ఇదంతా కేవలం రూల్స్ వల్లే జరగలేదని, ఇండిగో ప్లానింగ్ లోపమే కారణమని పైలట్ల సంఘం ఆరోపిస్తోంది. కొత్త రూల్స్ వస్తున్నాయని రెండేళ్ల ముందే తెలిసినా, కొత్త పైలట్లను తీసుకోకుండా ‘హైరింగ్ ఫ్రీజ్’ పెట్టారట. తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకునే స్ట్రాటజీ ఇప్పుడు బెడిసికొట్టిందని, అందుకే ఇప్పుడు షెడ్యూల్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఈ గందరగోళం సద్దుమణిగే వరకు మరో 48 గంటలు పడుతుందని, సమస్యను పరిష్కరిస్తున్నామని ఇండిగో చెబుతోంది. ఈలోపు ఎవరైనా ఇండిగోలో ప్రయాణం చేయాలనుకుంటే, ఇంటి నుంచి బయలుదేరే ముందే ‘ఫ్లైట్ స్టేటస్’ చెక్ చేసుకోవడం మంచిది. ఎయిర్‌పోర్టులో క్యూలు ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి త్వరగా వెళ్లండి. అలాగే వెంట స్నాక్స్, మందులు పెట్టుకోవడం సేఫ్. టికెట్ బుక్ చేసుకునే వాళ్లు ఫ్రీ క్యాన్సిలేషన్ ఆప్షన్స్ చూసుకుని బుక్ చేసుకోవడం ఉత్తమం.