రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌస్’లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ విదేశీ అతిథులకు విందులు ఇవ్వాలన్నా, కీలక చర్చలు జరపాలన్నా ఈ భవనమే వేదిక అవుతుంది. అయితే, ఇది కేవలం ప్రభుత్వ భవనం మాత్రమే కాదు, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా వెలుగొందిన హైదరాబాద్ చివరి నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన దర్జా కోసం కట్టించుకున్న రాజప్రాసాదం ఇది.
బ్రిటిష్ వారు రాజధానిని ఢిల్లీకి మార్చినప్పుడు, నిజాం నవాబు అక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైన గెస్ట్ హౌస్ ఉండాలని కోరుకున్నారు. అది కూడా అప్పటి వైస్రాయ్ హౌస్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్)కి ఏమాత్రం తగ్గకూడదని భావించారు. ఇందుకోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటియన్స్ చేత ఈ భవనాన్ని డిజైన్ చేయించారు. సీతాకోకచిలుక ఆకారంలో, ఇండో యూరోపియన్ స్టైల్లో నిర్మించిన ఈ భవనం ఢిల్లీలోని ఇతర సంస్థానాల భవనాల కంటే ఎంతో విలక్షణంగా, రాచరికపు ఠీవితో ఉంటుంది.
ఈ భవనంలో మొత్తం 36 గదులు, విశాలమైన కోర్ట్ యార్డ్స్, ఫౌంటెన్లు ఉన్నాయి. దీని నిర్మాణానికి 1920లలోనే నిజాం ఏకంగా 2 లక్షల పౌండ్లు ఖర్చు చేశారు. నేటి లెక్కల్లో చూస్తే దీని విలువ సుమారు 170 కోట్ల రూపాయలు ఉంటుంది. అప్పట్లో నిజాంకు ఉన్న అపార సంపదకు, ఆయన అభిరుచికి ఈ భవనం ఒక నిలువెత్తు సాక్ష్యం.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, సంస్థానాల విలీనంతో హైదరాబాద్ హౌస్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. 1974లో విదేశాంగ శాఖ దీని బాధ్యతలు స్వీకరించింది. అప్పటి నుంచి ఇది విదేశీ అధినేతలకు ఆతిథ్యం ఇచ్చే ప్రతిష్టాత్మక కేంద్రంగా మారింది. అశోక్ రోడ్ నంబర్ 1లో ఉన్న ఈ భవనం ఇప్పుడు భారత దౌత్య సంబంధాలకు ప్రధాన కార్యాలయంగా మారింది.
గతంలో బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఇప్పుడు పుతిన్ వంటి ప్రపంచ అగ్రనేతలు ఇక్కడే మన ప్రధానులతో భేటీ అయ్యారు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుడి విలాసానికి చిరునామాగా ఉన్న ఈ భవనం, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులు కలుసుకునే వేదికగా మారడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates