రాజ‌గోపాల్ బీజేపీలోకే.. ఎనీ డౌట్‌?

కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ దిశ‌గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రో చెప్పిన‌వి కావు.. స్వ‌యంగా రాజ‌గోపాల్‌రెడ్డి ప‌రోక్షంగా త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టారు. ఆయ‌న బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నార‌ని తెలిసిపోయింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. కేసీఆర్‌తో గ‌ట్టిగా కొట్లాడే పార్టీతోనే క‌లిసి ప్ర‌యాణిస్తాన‌ని తాజాగా రాజ‌గోపాల్‌రెడ్డి ప్ర‌క‌టించారు. అంటే తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ కొడుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీనే అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేర‌డం ఖాయ‌మైంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

తెంచుకునేందుకే..
కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకునేందుకే రాజ‌గోపాల్‌రెడ్డి సిద్ధ‌మ‌య్యార‌ని అందుకు అధిష్ఠానాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ కొట్లాడుతుంటే ఇందులోనే ఉంటాం.. వీళ్ల‌తో కాద‌నుకుంటే గ‌ట్టిగా కొట్లాడే పార్టీలోకి పోతామ‌ని తాజాగా రాజ‌గోపాల్‌రెడ్డి వెల్ల‌డించారు. స‌మ‌ర్థుడైన నాయ‌కుడిగా పీసీసీ ప‌ద‌వి ఇచ్చి ఉంటే ఆ జోష్ మ‌రోలా ఉండేద‌ని ప‌రోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. మంచి నాయ‌కుల‌ను నియ‌మించాల‌ని, గెలిచే వారికి టికెట్లు ఇవ్వాల‌ని అధిష్ఠానాన్ని కోరిన‌ట్లు పేర్కొన్నారు. కానీ గౌర‌వం ఇవ్వ‌లేని చోట ఉండ‌లేన‌ని, అర్హ‌త లేని వ్య‌క్తుల కింద ప‌ని చేయ‌లేన‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని..
పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా క‌ష్ట‌ప‌డుతున్న వాళ్ల‌ను కాద‌ని వేరే పార్టీలో నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి పీసీసీ ప‌ద‌వి ఎలా క‌ట్ట‌బెడుతారంటూ అధిష్ఠానాన్ని రాజ‌గోపాల్ ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. పార్టీలో ఉన్న త‌మ‌ను కాద‌ని టీడీపీలో నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డంతో అధిష్ఠానంపై ఆయ‌న తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు. అప్ప‌ట్లో బీజేపీపై పొగ‌డ్త‌లు కురిపించ‌డంతో ఆయ‌న ఆ పార్టీలోకి వెళ్లునున్నార‌నే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ త‌ర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇటీవ‌ల మ‌రోసారి పార్టీ హైక‌మాండ్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అధిష్ఠానం త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్లే కాంగ్రెస్ బ‌ల‌హీనంగా మారింద‌ని, గౌర‌వం ఇవ్వ‌ని చోట ఉండ‌లేనని ఆయ‌న తెగేసి చెప్పారు.

రాష్ట్రంలో బీజేపీ గట్టిగా పోరాడుతుంద‌ని తాను గతంలో చెప్పిన‌ట్లు ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు. ఇక మ‌రోవైపు ఆయ‌న సోదరుడు ఎంపీ వెంక‌ట్‌రెడ్డి మోడీని క‌లిసి కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసిన‌ట్లు వార్త‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. వెంక‌ట్‌రెడ్డి అడ‌గ‌గానే మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చారంటే కోమ‌టిరెడ్డి సోద‌రులు ఆ పార్టీలోకి జంప్ అవ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.