ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఆయనను బీజేపీ ఏమాత్రం లెక్క చేయలేదు. బీజేపీకి కంచుకోటగా పేరున్న బంకీపూర్ లో మేము కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తాయి అని కమలం నాయకులు ప్రగల్భాలు పలికారు. దాంతో బంకీ పూర్ ప్రజలకు ఎక్కడో కాలినట్టుంది. గంపగుత్తుగా ప్రశాంత్ కిషోర్ కు ఓట్లేసి గెలిపించారు.
సోమవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండు లోనూ ప్రశాంత్ కిషోర్ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఏ ఒక్క రౌండ్ లోనూ బీజేపీ తన ఉనికి చాటుకోలేక పోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సొంత నియోజకవర్గంలో చెజేతులా పరువు
పోగొట్టుకుంది.
ఇది బీజేపీకి కంచుకోట. నితిన్ నబిన్ ఇక్కడ నుంచి వరసగా ఐదు సార్లు గెలిచారు. ఇటీవల బీజేపీ జాతీయ పగ్గాలు చేపట్టడంతో అయన రాజ్యసభకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంకీ పూర్ అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ యువ నాయకుడు నీరజ్ కుమార్ సిన్హా పోటీకి నిలబడ్డారు. ఊహించని రీతిలో ప్రశాంత్ కిషోర్ పోటీకి దిగి బీజేపీకి షాక్ ఇచ్చారు.
ఎన్నికల వ్యూహకర్తగా బ్రాండ్ ఇమేజ్ సాధించిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ చిత్తుగా ఓటమి చెందాడు. దాంతో ఆయనకున్న ఇమేజ్ కూడా పోయింది. పట్టు విడవకుండా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడంతో బీహార్ లో రాజకీయ పరిణామాలు మారే సూచనలు కానవస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ, ఆర్జేడీలతో విసుగెత్తిన ప్రజలు ప్రత్యామ్నాయంగా జన్ సురాజ్ వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
