బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న పాద‌యాత్ర వంటి అంశాల‌పై వారితో చ‌ర్చించారా?  అంటే.. ఔన‌నే స‌మాధానం ల‌భిస్తోంది. దీనికి బెంగ‌ళూరులోని ఎల‌హంకలోని జ‌గ‌న్ ప్యాలెస్ వేదిక‌గా మారింద‌ని కూడా చెబుతున్నారు. వైసీపీ కీల‌క నాయ‌కుడు, పేరు వెల్ల‌డించేందుకు ఇష్ట‌ప‌డ‌ని నేత‌.. ఒక‌రు అత్యంత విశ్వ‌స‌నీయంగా అందించిన స‌మాచారం మేర‌కు .. ఇద్ద‌రు వ్యూహ‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న్ రెండు సార్లు భేటీ అయిన‌ట్టు తెలిసింది. ఈ భేటీ పూర్తి ఏకాంతంగా అత్యంత గోప్యంగా కూడా నిర్వ‌హించార‌ని స‌మాచారం.

మూడు అంశాల‌పై క‌స‌ర‌త్తు

జ‌గ‌న్ స‌ద‌రు వ్యూహ‌క‌ర్త‌ల‌తో మూడు ప్ర‌ధాన అంశాల‌పై క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు స‌ద‌రు నేత చెప్పుకొచ్చారు. 1) వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి హామీలు ఇవ్వాలి: 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధినేత న‌వ‌ర‌త్నాలు పేరుతో కీల‌క‌మైన తొమ్మిది హామీలు ఇచ్చారు. వీటిని అమ‌లు చేశారు. ప్ర‌తి కుటుంబానికీ ఏదో ఒక ప‌థ‌కం అందేలా చేశారు. అయితే.. అభివృద్ధిపై పెద్ద‌గా ఖ‌ర్చు చేయ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి రెండింటినీ మేళ‌వించి.. హామీలు ఇచ్చే దిశ‌గా క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఇది వ‌ర్క‌వుట్ అయితే.. గ‌తంలో ప‌డిన అభివృద్ధి లేమి ముద్రను తొల‌గించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

2) పాద‌యాత్ర‌:  2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. ఇప్పుడు కూడా అదే మంత్రం ప‌ఠిస్తున్నారు. 2027 డిసెంబ‌రు నుంచి ఏడాదిన్న‌ర‌పాటు పాద‌యాత్ర ఉంటుంద‌ని ఇప్ప‌టికే షెడ్యూల్ ప్ర‌క‌టించారు. దీనిలో మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే.. గ‌తానికి భిన్నంగా ఈ ద‌ఫా 5 వేల కిలోమీట‌ర్లు టార్గెట్ పెట్టుకున్న నేప‌థ్యంలో దీనిని పూర్తి చేయ‌డంతోపాటు ఏయే వ‌ర్గాల‌కు చేరువ కావాల‌న్న దానిపై వ్యూహ‌క‌ర్త‌ల నుంచి స‌ల‌హాలు తీసుకుంటున్నార‌ని తెలిసింది.

3) సీట్లు-నేత‌లు: 2024లో చేసిన ప్ర‌యోగం విక‌టించింది. అప్ప‌ట్లో మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు దాదాపు 80 శాతం మందిని మార్పు చేశారు. ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి మార్పు చేశారు. అయితే.. ఇది అనుకున్న విధంగా ఫ‌లితం ఇవ్వ‌లేదు ఈ నేప‌థ్యంలో రానున్న ఎన్నిక‌ల నాటికి ఎలాంటి వ్యూహం ప్ర‌కారం ముందుకు సాగాల‌న్న విష‌యంపై జ‌గ‌న్ క‌స‌రత్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంపై కూడా వ్యూహక‌ర్త‌ల నుంచి స‌ల‌హాలు.. సూచ‌న‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. అయితే.. ఈ వ్యూహ‌క‌ర్త‌ల్లో ఎవ‌రున్నారు? ఎక్క‌డివారు? అనే విష‌యాల‌పై మాత్రం స‌మాచారం అందాల్సి ఉంది.